సింగపూర్‌లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu launches CBN 361 Degrees book in Singapore
  • చంద్రబాబు దార్శనిక నిర్ణయాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకం రూపకల్పన
  • ప్రపంచ నేతలు లీ క్వాన్ యూ, జెసిందాతో పోల్చిన రచయిత శ్రీనివాస ప్రసాద్
  • త్వరలో తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లో పుస్తకం విడుదల
  • కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనా దక్షత, దార్శనికతపై రాసిన ‘సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్’ అనే పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం పుస్తకం తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, రాష్ట్ర మంత్రి పి. నారాయణ, అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వివిధ సందర్భాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను లోతుగా విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. 'రేపటికోసం' దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ ఈ పుస్తకాన్ని రచించగా, విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ ఆంగ్లంలోకి అనువదించారు. ఈ సందర్భంగా రచయిత శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ.. సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ, న్యూజిల్యాండ్ మాజీ ప్రధాని జెసిందా ఆర్డర్న్ వంటి ప్రపంచ స్థాయి నేతల మాదిరిగానే చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటారని విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన రూపొందించిన విజన్‌లు, అమరావతి రాజధాని నిర్మాణం పట్ల చూపిస్తున్న శ్రద్ధ దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ పుస్తకంలో ఏపీ రెరా మాజీ ఛైర్మన్ రామనాథ్ పలు సందర్భాల్లో వెల్లడించిన అభిప్రాయాల్లోని కీలక అంశాలను కూడా పొందుపరిచినట్టు రచయిత తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా సింగపూర్ రూపకర్త లీ క్వాన్ యూ శతజయంతిని పురస్కరించుకుని విడుదల చేసిన ప్రత్యేక వెండి నాణేన్ని అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి బహూకరించారు.

గతంలో విడుదలైన ‘చంద్రబాబు X.0’ పుస్తకం సాఫ్ట్ కాపీని సుమారు 8 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. దాని స్ఫూర్తితో రూపొందిన ఈ పుస్తకాన్ని త్వరలోనే తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. రాజకీయ పరిశోధకులు, నాయకత్వ లక్షణాలపై అధ్యయనం చేసేవారికి, మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రెరా మాజీ ఛైర్మన్ రామనాథ్, కేవీ సత్యనారాయణ, శంకర ప్రసాద్‌తో పాటు సింగపూర్‌లోని పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు.

Go Back to Shorts
Chandrababu Naidu
CBN 361 Degrees Book
Singapore Book Launch
Andhra Pradesh CM
Sakhamuru Srinivasa Prasad
Kakatiya Cultural Association

More Telugu News