Advertisement

పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో హరీశ్ రావు కన్నీటిపర్యంతం

Peddi Sudarshan Reddy funeral Harish Rao breaks down in tears
  • నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూత
  • ఉద్యమ సహచరుడి మరణం తీరని లోటన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
  • అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (51) అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. తన ఆప్తమిత్రుడిని కడసారి చూసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అంతిమయాత్రలో ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి దివంగత నేతకు తుది వీడ్కోలు పలికారు.

గురువారం రాత్రి సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. జూలై 26న హనుమకొండలోని తన నివాసంలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించిన వైద్యులు, అత్యవసర చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించగా, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు.

ఆయన భౌతికకాయాన్ని తొలుత హనుమకొండకు తీసుకువచ్చి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం నర్సంపేట మీదుగా ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన 2001 నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు. ఆయన మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిని, ఆత్మీయుడిని కోల్పోవడం తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Peddi Sudarshan Reddy
Harish Rao
BRS Leader
Narsampet MLA
KCR
Telangana Politics

More Telugu News