'కాక్రోచ్ జనతా పార్టీ'పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. సుమతీ శతకంతో పోలిక!
- ఢిల్లీలో జనసేన పార్టీ సమావేశం
- కాక్రోచ్ జనతా పార్టీపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సుమతీ శతకాన్ని ఉటంకిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు
- చీమల చేతిలో బలమైన పాము కూడా చనిపోతుందని వ్యాఖ్య
- విభజన శక్తులపై ఐక్యంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపు
దేశంలో అవినీతి, నిరుద్యోగం, విద్యావ్యవస్థలోని లోపాలను నిరసిస్తూ యువత సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన ఉద్యమమే 'కాక్రోచ్ జనతా పార్టీ'. ఈ పేరుతో పలుచోట్ల నిరసనలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "సుమతీ శతకంలో చెప్పినట్లు బలమైన సర్పం కూడా చలిచీమల చేతిలో చిక్కి చనిపోతుంది. ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చిన కాక్రోచ్ పార్టీని చూడగానే నాకు సుమతీ శతకం గుర్తొచ్చింది" అని అన్నారు.
దేశ సమగ్రతకు భంగం కలిగించే శక్తులు సిద్ధంగా ఉన్నాయని, అటువంటి విభజనవాద ఆలోచనల్లో చిక్కుకోకూడదనే ఉద్దేశంతోనే ఢిల్లీలో సమావేశమయ్యామని పవన్ తెలిపారు. కోట్ల మంది కలిస్తే మంచి లేదా చెడు ఏదైనా బలమైన ప్రభావాన్ని చూపించగలరని పేర్కొన్నారు. విభజనవాదాన్ని సృష్టిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో మనం అందులో భాగస్వాములం కాకుండా, ఐక్యంగా ఎదురొడ్డి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.