నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
- సీఫుడ్ ఎగుమతులపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు
- పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి, సైకిల్ తొక్కనున్న సీఎం
- విశాఖ ఎకనమిక్ రీజియన్పై అధికారులతో సమీక్షా సమావేశం
- మత్స్య రంగం అభివృద్ధి, ప్రత్యామ్నాయ మార్కెట్లపై సదస్సులో చర్చ
తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఉదయం 10 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్కు చేరుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ మొక్కలు నాటుతారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ సందేశాన్నిస్తూ, 'నెట్ జీరో' కార్యక్రమంలో భాగంగా ఏయూ నుంచి నోవోటెల్ హోటల్ వరకు సైకిల్పై ప్రయాణించనున్నారు.
అనంతరం నోవోటెల్ హోటల్లో విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, రామ్మోహన్ నాయుడు, రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్, ఎస్పీ భగేల్ సింగ్లతో కలిసి సీఫుడ్ ఎగుమతులపై వర్క్షాప్లో పాల్గొంటారు.
ప్రస్తుతం సీఫుడ్ ఎగుమతుల పరిస్థితి, యూరోపియన్ యూనియన్ దేశాలు సహా ఇతర ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించడం, మెరైన్ ఫిషరీస్లో ఉన్న అవకాశాలు, మత్స్య రంగం అభివృద్ధి వంటి కీలక అంశాలపై ఈ వర్క్షాప్లో విస్తృతంగా చర్చించనున్నారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు అమరావతికి తిరుగు పయనమవుతారు.