ఐపీఎల్ 2026లో ఘోర పరాభవం.. లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషబ్ పంత్

Rishabh Pant Steps Down as Lucknow Super Giants Captain
  • ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లకు గాను పదింట లక్నో ఓటమి
  • పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన లక్నో
  • రిషబ్ పంత్ తప్పుకుంటానని చెప్పడంతో అంగీకరించిన యాజమాన్యం
లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) జట్టు కెప్టెన్సీ నుంచి రిషబ్ పంత్ వైదొలిగాడు. ఈ మేరకు ఎల్ఎస్‌జీ ప్రకటన చేసింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌లకు గాను కేవలం నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని రిషబ్ పంత్ కోరాడని, అందుకు తాము అంగీకరించినట్లు లక్నో యాజమాన్యం తన 'ఎక్స్' వేదిక ద్వారా వెల్లడించింది.

కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకుంటానని రిషబ్ పంత్ జట్టును కోరాడని, ఆయన కోరికను యాజమాన్యం అంగీకరించిందని లక్నో క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ వెల్లడించాడు. ఇంతకాలం రిషబ్ పంత్ ఎంతో సహకారం అందించాడని పేర్కొన్నాడు. ఇప్పుడు జట్టును తిరిగి పునర్నిర్మించడంపై దృష్టి సారిస్తామని అన్నాడు.

రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎనిమిది సీజన్‌లలో ఆడాడు. 2025 ఐపీఎల్‌కు ముందు వేలంలో అతడిని లక్నో రూ.27.50 కోట్లకు కొనుగోలు చేసి, ఆ తర్వాత సారథ్య బాధ్యతలను అప్పగించింది. గత ఐపీఎల్‌లో లక్నో 14 మ్యాచ్‌లకు గాను ఆరు గెలుచుకుని పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. 2026 ఐపీఎల్‌లో రిషబ్ పంత్ 312 పరుగులు చేశాడు. కానీ జట్టు 10 ఓటములతో అట్టడుగు స్థానంలో నిలిచింది. 2022లో ప్రారంభమైన లక్నో జట్టుకు వరుస మూడు సీజన్‌లలో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండుసార్లు ప్లేఆఫ్‌కు, ఒకసారి ఏడో స్థానంలో నిలిచింది.
Go Back to Shorts
Rishabh Pant
Lucknow Super Giants
LSG
IPL 2026
Indian Premier League
Cricket
KL Rahul
Tom Moody

More Telugu News