ఒకే ఒక్క ఫొటోతో రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన కొడాలి నాని

Kodali Nani Puts Full Stop to Rumors with One Photo
  • తాడేపల్లిలో వైఎస్ జగన్‌తో భేటీ అయిన కొడాలి నాని
  • పార్టీ మారతారన్న ప్రచారానికి ఫొటోతో సమాధానం
  • ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేతో ఆలయాల సందర్శనతో పెరిగిన ఊహాగానాలు
  • పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించినట్లు వెల్లడి
  • తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టమైన సంకేతం
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని తన రాజకీయ భవిష్యత్తుపై కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఒక్క ఫొటోతో తెరదించారు. ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ వచ్చిన వార్తలకు చెక్ పెడుతూ, బుధవారం తాడేపల్లిలోని నివాసంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ఫొటోను పంచుకోవడంతో పార్టీ మార్పు చర్చకు ముగింపు పడినట్లయింది.

2024 ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నాని రాజకీయంగా పెద్దగా క్రియాశీలకంగా కనిపించలేదు. మధ్యలో అనారోగ్య సమస్యలతో ముంబైలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన గుడివాడ నియోజకవర్గానికి, ఏపీ రాజకీయాలకు కొంత దూరంగానే ఉన్నారు. ఈ క్రమంలో మార్చి నెలలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మాతే కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తి, తిరుమల, విజయవాడ కనకదుర్గ ఆలయాలను సందర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి ఆయన ఆలయాలను దర్శించుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో కొడాలి నాని వైసీపీని వీడి, కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటూ మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

ఈ ఊహాగానాలకు సమాధానం ఇచ్చేలా కొడాలి నాని తాజా అడుగు వేశారు. జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించామని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ భేటీతో తాను వైసీపీని వీడేది లేదని, తన ప్రయాణం జగన్ వెంటేనని ఆయన పరోక్షంగా స్పష్టమైన సంకేతాలు పంపారు. దీంతో ఆయన పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి పూర్తిగా అడ్డుకట్ట పడింది.
Go Back to Shorts
Kodali Nani
YS Jagan Mohan Reddy
YSRCP
Andhra Pradesh Politics
Gudivada
BJP
Political Rumors
Tadepalli
Andhra Pradesh
2024 Elections

More Telugu News