మణిపూర్‌లో మళ్లీ హింస: నాగా, కుకీల మధ్య ఘర్షణలు.. 20కి పైగా ఇళ్లు దహనం!

Manipur Violence Erupts Again as Naga and Kuki Clashes Lead to Burning of 20 Houses
  • రెండు వర్గాల మధ్య సాయుధ పోరు
  • సరిహద్దు గ్రామాల్లో ఇళ్లపై దాడులు
  • భద్రతా దళాల భారీ మోహరింపు
  • గత హత్యల నేపథ్యమే ప్రధాన కారణం! 
మణిపూర్ రాష్ట్రంలో హింస మళ్లీ ప్రజ్వరిల్లింది. భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని కామ్‌జోంగ్ జిల్లాలో బుధవారం నాగా, కుకీ సామాజిక వర్గాల మధ్య సాయుధ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాలకు చెందిన సాయుధ బృందాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పాటు గ్రామాల్లోని 20కి పైగా ఇళ్లకు నిప్పు పెట్టారు. ఉదయం వేళ ఒక కుకీ గ్రామం నుండి వచ్చిన సాయుధులు సమీపంలోని నాగా గ్రామంపై దాడి చేసి 10 ఇళ్లను తగలబెట్టడంతో ఈ హింస ప్రారంభమైంది. ఆ తర్వాత మధ్యాహ్నం దీనికి ప్రతికారంగా మరో వర్గం జరిపిన ఎదురు దాడుల్లో నాగా కమ్యూనిటీకి చెందిన ఇంకో 12 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఉద్రిక్తతలను అదుపు చేయడానికి అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దించి, ఆయా గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

జూన్ 11న కాంగ్‌పోక్‌పి జిల్లాలో ఆరుగురు నాగా పౌరుల మృతదేహాలు లభించడం, అంతకుముందు మే 13న వారిని కొందరు అపహరించడమే ఈ తాజా హింసకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ హత్యల తర్వాత రెండు వర్గాల మధ్య తీవ్ర నిరసనలు, ఆర్థిక దిగ్బంధనాలు జరిగాయి. కుకీలు నివసించే ప్రాంతాలకు నిత్యావసర వస్తువుల రవాణా వాహనాల కదలికలపై వివాదాలు రేగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే, బుధవారం జరిగిన ఘర్షణల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు అధికారికంగా ప్రకటించారు.

బలగాల ఉపసంహరణపై అనుమానాలు
ఈ తాజా దాడిపై ప్రముఖ కుకీ సంస్థ 'కుకీ ఇన్పి మణిపూర్' (కేఐఎం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగా ఆధిపత్యం ఉన్న కొండ ప్రాంతాల్లోని కుకీ గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించింది. భద్రతా బలగాల రక్షణలో ఉన్న సదరు గ్రామం నుండి, వారు పోస్ట్‌ను ఖాళీ చేసి వెళ్లిన మరుసటి రోజే ఈ దాడి జరగడం వెనుక భద్రతా లోపాలు ఉన్నాయని, దీనిపై తక్షణమే పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేసింది.

మరోవైపు, ఆరుగురు నాగా పౌరుల హత్యకు తమ వాళ్లే కారణమని ఒప్పుకుంటూ 'కుకీ-జో కౌన్సిల్' (కేజడ్‌సీ) ఛైర్మన్ హెన్లియాంతంగ్ థాంగ్లెట్ ఇటీవల క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో జరిగిపోయిన ఆ తప్పుపై నిష్పక్షపాత విచారణ జరపాలని కోరారు. అయితే, వివిధ నాగా గ్రూపులు ఈ క్షమాపణలను తిరస్కరించాయి. ఆ క్షమాపణల్లో నిజాయతీ లేదని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఈ పాత కక్షల నేపథ్యమే ఇప్పుడు కామ్‌జోంగ్ జిల్లాను మళ్లీ అశాంతి వైపు నెట్టింది.
Manipur Violence
Naga Kuki Clashes
Kamjong District
Kuki Inpi Manipur
Manipur Ethnic Conflict
Indo Myanmar Border

More Telugu News