ఐటీకి మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌?.. ప్రధాని సూచనతో మొదలైన చర్చ

Narendra Modi Suggests Work from Home for IT Sector
  • ఇంధన పొదుపు కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ పాటించాలని ప్రధాని మోదీ పిలుపు
  • హైబ్రిడ్ విధానంలో ఇప్పటికే పొదుపు చర్యలు తీసుకుంటున్నామన్న నాస్కామ్
  • వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రానికి ఐటీ ఉద్యోగ సంఘం విజ్ఞప్తి
  • గల్ఫ్ సంక్షోభం, పెరిగే రవాణా ఖర్చులతో కంపెనీల పునరాలోచన
చమురు సంక్షోభం నేపథ్యంలో ఇంధనాన్ని పొదుపు చేసేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచన ఐటీ రంగంలో కొత్త చర్చకు దారితీసింది. కొవిడ్ అనంతరం ఆఫీసులకు వస్తున్న ఉద్యోగులకు మళ్లీ ఇంటి నుంచి పని చేసే అవకాశం వస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్, ఉద్యోగ సంఘాలు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

ప్రధాని సూచనపై నాస్కామ్ స్పందిస్తూ ఐటీ కంపెనీలు ఇప్పటికే హైబ్రిడ్ పని విధానాన్ని సమర్థంగా అమలు చేస్తున్నాయని తెలిపింది. ఉద్యోగి బాధ్యతలు, క్లయింట్ అవసరాలను బట్టి కంపెనీలే ఈ నిర్ణయాలు తీసుకుంటాయని పేర్కొంది. కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే కాకుండా, క్యాంపస్‌లలో విద్యుత్ వాడకాన్ని తగ్గించడం వంటి ఇతర పొదుపు చర్యలు కూడా చేపడుతున్నాయని వివరించింది.

మరోవైపు, ఐటీ ఉద్యోగ సంఘం ‘నైట్స్’ (NITES) మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనివల్ల ఇంధన ఆదాతో పాటు, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని, పర్యావరణానికి మేలు జరుగుతుందని పేర్కొంది. కొవిడ్ సమయంలో ఏర్పాటు చేసుకున్న రిమోట్ వర్క్ మౌలిక సదుపాయాలను తిరిగి ఉపయోగించుకోవాలని సూచించింది.

గల్ఫ్ సంక్షోభం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, రవాణా ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు కూడా పునరాలోచనలో పడ్డాయి. కొవిడ్ సమయంలో దాదాపు మూడేళ్లపాటు వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ విధానంలో పనిచేసిన ఐటీ ఉద్యోగులను గతేడాది నుంచి కంపెనీలు ఆఫీసులకు రావాలని ఒత్తిడి చేస్తున్నాయి. తాజా పరిణామాలతో కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.
Go Back to Shorts
Narendra Modi
Work from Home
IT Sector
NASCOM
NITES
Hybrid Work Model
Fuel Conservation
Remote Work
IT Employees
Energy Saving

More Telugu News