ఎర్రకోటపై ప్రధాని పక్కన నిలిచిన ఆ మహిళా ఆఫీసర్ ఎవరు?: నెట్టింట ట్రెండ్ అవుతున్న కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్
- జాతీయ పతాకావిష్కరణ సమయంలో మోదీకి సహకరించిన సోనియా సింగ్ చౌహాన్
- గూగుల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్ పేరు
- భారత సైన్యంలో కమిషన్డ్ ఆఫీసర్గా సేవలందిస్తున్న సోనియా సింగ్
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోట వేదికపై జాతీయ పతాకావిష్కరణ సమయంలో ప్రధాని మోదీ పక్కనే ఉండి సహకరించిన మహిళా ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. వేడుకలు పూర్తయిన వెంటనే ఆమె ఎవరు అని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపడంతో గూగుల్లో ఆమె పేరు విశేషంగా ట్రెండ్ అయింది.
భారతీయ సైన్యంలో కమిషన్డ్ ఆఫీసర్గా సేవలందిస్తున్న కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్కు ఈ ఏడాది ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకావిష్కరణలో ప్రధానికి నేరుగా సాయమందించే అత్యంత కీలకమైన అధికారిక బాధ్యతను రక్షణ మంత్రిత్వ శాఖ అప్పగించింది. ఎర్రకోట వేదికపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించే సమయంలో సైనిక నిబంధనలకు కట్టుబడి జెండాను ఎగురవేయడంలో, త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం సమర్పించడంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు.
భారత రక్షణ దళాలలో మహిళా శక్తికి (నారీ శక్తి), వారి ఎదుగుదలకు నిదర్శనంగా కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్ నిలిచారని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన అధికారిక షెడ్యూల్ ప్రకారం ప్రధానితో పాటు ఎర్రకోట వేదికపై ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించిన ఏకైక మహిళా మిలిటరీ అధికారిగా ఆమె గుర్తింపు పొందారు.