లోక్ భవన్‌లో గవర్నర్ 'ఎట్ హోం'.. సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు

Governor At Home in Lok Bhavan CM Chandrababu attends with his wife
  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో 'ఎట్ హోం'
  • గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో తేనీటి విందు
  • ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు
  • పాల్గొన్న మంత్రులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు
  • గవర్నర్, ముఖ్యమంత్రి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ విజయవాడలోని లోక్ భవన్‌లో 'ఎట్ హోం' కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులను గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆయన అర్ధాంగి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి ఇరువురూ ఒకరికొకరు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

అనంతరం గవర్నర్ దంపతులు ఆహ్వానితులకు తేనీటి విందు ఇచ్చారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వయంగా ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సైనిక అధికారులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖుల రాకతో లోక్ భవన్ ప్రాంగణం పండుగ వాతావరణంలో సందడిగా మారింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది.

అనారోగ్యం కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కాకినాడలో ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ లో పాల్గొన్న అనంతరం పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో, ఆయన ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనడంలేదని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజమండ్రిలో వైద్య పరీక్షల అనంతరం పవన్ కల్యాణ్ హైదరాబాద్ వెళ్లిపోయారు. 
Advertisement
Chandrababu Naidu
Governor Abdul Nazeer
Independence Day At Home
Vijayawada Lok Bhavan
Nara Bhuvaneshwari
Pawan Kalyan health

More Telugu News