హంతకులను వైసీపీ ప్రోత్సహిస్తోంది: మంత్రి సవిత
- సమాజం కోసం పనిచేసే నాయకులను టీడీపీ అందిస్తోందన్న సవిత
- వైసీపీ 'శవరాజకీయాలు' చేస్తోందని విమర్శ
- జగన్ నిర్ణయాల వల్ల బీసీలు, దళితులు నష్టపోతున్నారని వ్యాఖ్య
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మంత్రి సవిత మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ సమాజం కోసం పనిచేసే నాయకులను అందిస్తుంటే, వైసీపీ మాత్రం హంతకులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. హత్యలు చేయడం, సాక్షులను బెదిరించడం, చివరికి న్యాయమూర్తులను కూడా లక్ష్యంగా చేసుకోవడం వైసీపీ అధినేత జగన్కు వెన్నతో పెట్టిన విద్య అని ఆమె ఆరోపించారు. జగన్ బాటలోనే నడుస్తూ వైసీపీ నేతలు 'శవరాజకీయాలు' చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి 'డోర్ డెలివరీ' చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు వంటి వారిని జగన్ వెనకేసుకురావడం ఆయన సైకోతనానికి పరాకాష్ఠ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎక్కువగా నష్టపోతున్నది బీసీలు, దళితులేనని ఆమె పేర్కొన్నారు. గతంలో విచారణలో కొంత ఏమరపాటు ఉండి ఉండొచ్చేమో కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. బాబాయ్ గొడ్డలిపోటు వంటి సంఘటనలను గుర్తు చేస్తూ, చంపడం, రౌడీలను ప్రోత్సహించడమే ఆ పార్టీ అజెండా అని విమర్శించారు.