తల్లిని, చెల్లిని గెంటేసిన వ్యక్తి మహిళా పక్షపాతి అవుతారా?: జగన్ పై గౌతు శిరీష ఫైర్

Gouthu Sirisha Fires at Jagan on Womens Safety and Policies
  • మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైసీపీ నేతల విమర్శలు హాస్యాస్పదమన్న గౌతు శిరీష 
  • ఆస్తి కోసం తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన జగన్ మహిళా పక్షపాతి కాదని విమర్శలు
  • వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని జగన్ ప్రభుత్వం కాపాడిందని ఆరోపణ
  • అమరావతి మహిళలను వేధించిన చరిత్ర వైసీపీది అంటూ ఆగ్రహం
వైసీపీ నేతలు ఇప్పటివరకు విలన్లు అనుకుంటే, ఇప్పుడు వారు చేస్తున్న విమర్శలతో ఉత్త జోకర్లుగా నిరూపించుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే, ఏపీలోని వైసీపీ నేతలు మాత్రం విషం చిమ్ముతున్నారని ఆమె మండిపడ్డారు. తల్లిని, చెల్లిని గెంటేసిన వ్యక్తి మహిళా పక్షపాతి అవుతారా? అంటూ జగన్ పై ధ్వజమెత్తారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జగన్ పాలనలో మహిళలపై అనేక అకృత్యాలు జరిగాయంటూ నిప్పులు చెరిగారు.

"మాజీ మంత్రి విడుదల రజిని గారు టీడీపీ వస్తే అకృత్యాలు జరుగుతాయని అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి 2023 ఎన్సీఆర్‌బీ నివేదిక చూడండి. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో నేరాలు ఏ స్థాయిలో పెరిగాయో ఆ నివేదిక చెంపదెబ్బ కొట్టినట్లు చెబుతోంది. దక్షిణాదిలో మనకంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడును వెనక్కి నెట్టి ఏపీని నేరాల్లో నంబర్ వన్ చేసిన ఘనత మీ జగన్ రెడ్డిది కాదా?" అని శిరీష ప్రశ్నించారు. 

దళితులపై అఘాయిత్యాల్లో కూడా రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, మీ హయాంలో జరిగిన నేరాల చిట్టా చూస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ఆమె నిలదీశారు. చంద్రబాబు పాలనకు, జగన్ గందరగోళ పాలనకు నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందని శిరీష అన్నారు. 

"ఎన్టీఆర్ గారు ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పిస్తే, చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలతో కోటి మంది మహిళలకు ఆర్థిక సాధికారత ఇచ్చారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి మహిళలను మహారాణులను చేశారు. కానీ, జగన్ రెడ్డి పాలనలో ఏం జరిగింది? అమరావతికి భూములిచ్చిన ఆడబిడ్డలను నడిరోడ్డుపై ఈడ్చి, వారిపై డ్రోన్లు తిప్పి వేధించిన క్రూరమైన చరిత్ర మీది. సొంత తల్లికి, చెల్లికి గౌరవం ఇవ్వని జగన్ రెడ్డి, రాష్ట్ర మహిళలకు మేలు చేశామని చెప్పుకోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్" అని ఆమె విమర్శించారు.

వైసీపీ సోషల్ మీడియా సైకోలు టీడీపీ, జనసేన వీరమహిళలపై పెట్టిన అశ్లీల పోస్టుల ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని, తాను కూడా బాధితురాలినేనని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. "జగనన్న వదిలిన బాణం అని పాదయాత్ర చేసిన చెల్లి షర్మిలపైనే నీచమైన పోస్టులు పెట్టిస్తున్నారు. ఆస్తిలో వాటా అడిగినందుకు కన్నతల్లిని బయటకు గెంటేసిన చరిత్ర జగన్‌ది. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపిన వారిని శిక్షించాలని పోరాడుతున్న ఆయన కూతురు సునీత రెడ్డిపై సాక్షి పత్రికలో రాయిస్తున్న రాతలు ఎంత అసహ్యంగా ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారు. ఇంతటి దమనకాండ సాగించి, ఈరోజు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు" అని శిరీష సవాల్ విసిరారు.

జగన్ హయాంలో జరిగిన దారుణాలను ఆమె పేరుపేరునా ప్రస్తావించారు. 'జై జగన్' అనలేదని చంద్రయ్యను గొంతు కోసి చంపడం, మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపడం, తన సోదరిని ఏడిపించారని అడిగిన పదేళ్ల బాలుడు అమర్నాథ్‌ గౌడ్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టడం వంటి రాక్షస పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో ముగ్గురు మహిళలకు కీలక శాఖలు ఇచ్చి చంద్రబాబు మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారని, వైసీపీ నేతలు ఇప్పటికైనా అబద్ధాలు ఆపి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని గౌతు శిరీష డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Gouthu Sirisha
YS Jagan
Andhra Pradesh Politics
TDP
Women Reservation Bill
NCBR Report
Crimes Against Women
Chandrababu Naidu
YSRCP
AP Government

More Telugu News