Air India Express: గాల్లో ప్రయాణిస్తుండగా పొగలు... ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Air India Express Flight Emergency Landing in Lucknow After Smoke Detected
షార్ట్స్‌లో చూడండి
బాగ్డోగ్రా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పొగలు రావడంతో సోమవారం సాయంత్రం కలకలం రేగింది. అప్రమత్తమైన పైలట్, విమానాన్ని లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 148 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా, అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

విమానం గాల్లో ఉండగా, కీలకమైన ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉండే ఏవియానిక్స్ బేలో సిబ్బంది పొగలను గుర్తించారు. వెంటనే పైలట్ అత్యవసర పరిస్థితిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియజేశారు. ప్రాణాపాయం లేని, కానీ అత్యవసరమైన పరిస్థితుల్లో వాడే 'పాన్-పాన్' కాల్ ద్వారా సమాచారం అందించారు. ఇది తీవ్రమైన ప్రమాదాన్ని సూచించే 'మేడే' కాల్ కంటే భిన్నమైనది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని లక్నోకు మళ్లించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

లక్నోలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులకు అల్పాహారం అందించి, ప్రత్యామ్నాయ విమానాల్లో వారిని ఢిల్లీకి పంపించారు. జరిగిన అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణలు చెబుతున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఈ విమానాన్ని 'ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్' (ఏఓజీ)గా ప్రకటించి, పూర్తిస్థాయి తనిఖీల కోసం లక్నోలోనే నిలిపివేశారు.

ఇటీవల కాలంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం ఇది రెండోసారి. ఈ నెల 11న హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్లిన విమానం ల్యాండ్ అయ్యాక దాని ముందు చక్రంలో సాంకేతిక సమస్య ఎదురైన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Air India Express
Air India
emergency landing
Lucknow airport
Bagdogra Delhi flight
flight smoke
aviation safety
Chaudhary Charan Singh International Airport
aircraft on ground
AOG

More Telugu News