Pawan Kalyan: అసెంబ్లీ వేదికగా పవన్ కల్యాణ్ కు థాంక్స్ చెప్పిన చంద్రబాబు... ఫొటో ఇదిగో!

Chandrababu Thanks Pawan Kalyan for Support
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి చట్టబద్ధతను పునరుద్ధరించే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కల్యాణ్ పోషించిన పాత్రను, ఆయన అందించిన మద్దతును ఎప్పటికీ మరవలేనని చంద్రబాబు భావోద్వేగంగా ప్రసంగించారు. కూటమి చారిత్రక విజయంలో పవన్ పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.

కూటమి ఏర్పాటులో పవన్ కీలక పాత్ర
2014 ఎన్నికల సమయాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు, "ఆనాడు బీజేపీతో పొత్తు ఖరారైన తర్వాత, పవన్ కల్యాణ్ గారిని కలవడానికి నేను స్వయంగా వారి ఇంటికి వెళ్లాను. రాష్ట్ర భవిష్యత్తు, దేశ రాజకీయాల దృష్ట్యా ఎన్డీయే కూటమికి బేషరతుగా మద్దతు ఇస్తానని పవన్ ఆ రోజు చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ మాకు మద్దతుగా నిలిచారు" అని వివరించారు. అలాగే, 2024 ఎన్నికలకు ముందు తాను జైల్లో ఉన్నప్పుడు, రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీలన్నీ కలిసి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ తీసుకున్న చొరవను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు.

అది చారిత్రక విజయం
2024 ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం అసాధారణమైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. "నేను ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాను. కానీ 94 శాతం స్ట్రైక్ రేట్‌తో, 175 స్థానాలకు గాను 164 సీట్లు గెలిచిన ఏకైక ఎన్నిక ఇదే. ఇది మూడు రాజధానులకు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు. ఈ విజయంతో రాష్ట్రంలో మళ్లీ మంచి రోజులు ప్రారంభమయ్యాయి" అని చంద్రబాబు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రానికి వైసీపీ ద్రోహం చేసింది
గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ ద్రోహం చేసింది. అమరావతిని శివసేన, బీజేపీ, చివరికి కాంగ్రెస్ కూడా అంగీకరించాయి. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజధానిని నాశనం చేసిన ఏకైక పార్టీ వైసీపీనే" అని ఆయన ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో అమరావతి రైతులు, ప్రజలు పడిన బాధ వర్ణనాతీతమని అన్నారు.

అమరావతి పనులు మళ్లీ ప్రారంభం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులను పునఃప్రారంభించామని చంద్రబాబు తెలిపారు. "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఒక నగరంలో పనులు ఆగిపోయి, మళ్లీ రీస్టార్ట్ కావడం చరిత్రలో అమరావతిలోనే జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ. 15,000 కోట్లు మంజూరు చేసింది. మే 2, 2025న పనులు పునఃప్రారంభించాం. నిధుల సమీకరణకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం" అని సభకు వివరించారు.

2028 నాటికి పూర్తి.. పక్కా టైమ్‌లైన్
అమరావతి నిర్మాణ పనుల పూర్తికి సంబంధించిన స్పష్టమైన గడువులను కూడా సీఎం చంద్రబాబు సభలో ప్రకటించారు. మంత్రి నారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ వివరాలను వెల్లడించారు. "ట్రంక్ రోడ్లన్నీ 2027 మే 27 నాటికి పూర్తవుతాయి. అసెంబ్లీ భవనాన్ని 2028 మే 28 నాటికి, హైకోర్టును 2028 జూన్ 20 నాటికి పూర్తి చేస్తాం. ఐదు ఐకానిక్ టవర్లను 2028 ఆగస్టు 4 నాటికి పూర్తి చేసి రాజధానిని అనుకున్న సమయానికి ప్రజలకు అందిస్తాం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Pawan Kalyan
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
Assembly
YCP
Capital City
2024 Elections
Coalition Government
Narendra Modi

More Telugu News