44 పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇస్తా: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Announces Scholarships for Students in 44 Schools
  • వివాహం అనంతరం సొంతూరులో సందడి చేసిన విజయ్ దేవరకొండ
  • 9వ, 10వ తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ఉపకారవేతనం
  • ఈ సంవత్సరం నుండి గ్రామంలో, వచ్చే సంవత్సరం నుండి అచ్చంపేట డివిజన్‌లో! 
ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాహం అనంతరం తన సొంతూరిలో సందడి చేసిన ఆయన వచ్చే విద్యా సంవత్సరం నుంచి అచ్చంపేట డివిజన్‌లోని విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తానని ప్రకటించారు. విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం గత నెలలో జరిగింది. ఈరోజు నాగర్ కర్నూలుజిల్లా బల్మూరు మండలంలోని స్వగ్రామం తుమ్మన్‌పేటకు భార్య రష్మికతో కలిసి వచ్చారు.

ఇటీవల తన స్వగ్రామంలో కొత్త ఫాంహౌస్ నిర్మించుకున్నారు. గ్రామానికి వచ్చిన విజయ్ దేవరకొండ, రష్మికలకు గ్రామస్థులు, అభిమానులు డప్పులు, కోలాటంతో ఘనస్వాగతం పలికారు. గృహ ప్రవేశం అనంతరం, తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొన్నారు.

అనంతరం గ్రామస్థులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడారు. తమ కుటుంబం 32 ఏళ్ల క్రితం తుమ్మన్‌పేట నుంచి వెళ్లినప్పటికీ గ్రామస్థులతో తమ కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని అన్నారు. తనకు సొంతూరులోనే మొదటి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించినట్లు తల్లిదండ్రులు చెప్పారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి కోరిక మేరకు ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నానని అన్నారు. అందరికీ విందు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 9వ, 10వ తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఉపకారవేతనం ఇస్తానని ప్రకటించారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి దీనిని అందజేస్తానని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అచ్చంపేట డివిజన్ పరిధిలోని 44 పాఠశాలల్లో దీనిని అమలు చేస్తానని వెల్లడించారు. 
Go Back to Shorts
Vijay Deverakonda
Vijay Deverakonda scholarship
Achampet division
Telangana education
Rashmika Mandanna

More Telugu News