గిగ్ వర్కర్లు, క్యాబ్ డ్రైవర్ల కష్టాలపై కవిత ఆవేదన
- లక్షలాది మంది డెలివరీ వర్కర్లు, ఆటో, క్యాబ్ వర్కర్ల పరిస్థితి దయనీయంగా ఉందన్న కవిత
- ఆదాయం కుటుంబ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని ఆవేదన
- వీరంతా నిరసనబాట పట్టే అవకాశం ఉందని హెచ్చరిక
స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది డెలివరీ వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడినా వారికి వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదని అన్నారు. గత మూడేళ్లుగా ఛార్జీలు పెంచాలని అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. అగ్రిగేటర్ సంస్థలు భారీగా కమీషన్ల కోత విధిస్తూ, అన్యాయంగా రేట్లను నియంత్రిస్తుండటంతో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారని తెలిపారు.
గిగ్ వర్కర్లు, డ్రైవర్ల పక్షాన ప్రభుత్వం నిలబడాలని, వెంటనే అగ్రిగేటర్ సంస్థలతో చర్చలు జరిపి ఛార్జీలు పెంచేలా చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం వీరంతా 'వర్క్ బ్రేక్ డౌన్' వంటి నిరసనబాట పట్టే పరిస్థితి తెప్పించకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. గిగ్ వర్కర్లు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.