Stock Market: మూడు రోజుల లాభాలకు బ్రేక్... ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market Ends Flat Ending Three Day Rally
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. బుధవారం ట్రేడింగ్‌లో సూచీలు రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. కీలకమైన ద్రవ్యోల్బణ (సీపీఐ) గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లో మిశ్రమ ధోరణి కనిపించింది.

ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 40 పాయింట్ల స్వల్ప నష్టంతో 84,233 వద్ద స్థిరపడింది. అయితే, నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 25,953 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్లు కూడా దాదాపు ఫ్లాట్‌గానే కదలాడాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.03 శాతం లాభపడగా, స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.02 శాతం పెరిగింది. బీఎస్‌ఈలో 1,701 షేర్లు లాభపడగా, 2,259 షేర్లు నష్టాల్లో ముగిశాయి. దీంతో మార్కెట్ బ్రెడ్త్ నెగిటివ్‌గా నమోదైంది.

రంగాల వారీగా చూస్తే, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు మినహా మిగిలినవన్నీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఐటీ సూచీ 1.76 శాతం మేర నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. మరోవైపు, నిఫ్టీ ఆటో 1.30 శాతం, ఫార్మా 1.01 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.03 శాతం చొప్పున లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.13 పైసలు బలహీనపడి 90.68 వద్ద ట్రేడయ్యింది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయి.

మార్కెట్ స్పష్టమైన దిశానిర్దేశం చేసేంత వరకు పరిమిత శ్రేణిలోనే కదలాడవచ్చని, స్టాక్ ఆధారిత కదలికలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ 60,750 వద్ద ముగిసి, 60,500 మద్దతు స్థాయిని నిలబెట్టుకుంది.
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty
Indian Stock Market
CPI Data
Rupee
Share Market
BSE
NSE

More Telugu News