AP Fishermen: బంగ్లాదేశ్ చెర నుంచి 9 మంది ఏపీ మత్స్యకారుల విడుదల

Bangladesh Releases 9 AP Fishermen Detained for 4 Months
షార్ట్స్‌లో చూడండి
బంగ్లాదేశ్ జైలులో నాలుగు నెలలుగా మగ్గుతున్న ఏపీకి చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు ఈ రోజు సురక్షితంగా విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ తీరంలో తమ కుటుంబసభ్యులను చూసి వారు భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటిపర్యంతమైన ఆత్మీయులను హత్తుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడటంతో వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది.

గతేడాది అక్టోబర్‌లో బంగాళాఖాతంలో వేటకు వెళ్లిన వీరు, పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించడంతో ఆ దేశ నౌకాదళం వీరిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి వీరు అక్కడి జైలులోనే ఉన్నారు. భారత ప్రభుత్వం చొరవతో జనవరి 29న అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ వద్ద బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వీరిని భారత తీర రక్షక దళానికి (ఇండియన్ కోస్ట్ గార్డ్) అప్పగించింది. అక్కడి నుంచి వీరిని విశాఖ మత్స్యకార నౌకాశ్రయానికి తీసుకువచ్చి, మెరైన్ పోలీసులకు అప్పగించారు.

ఈ విడుదల రెండు దేశాల మధ్య కుదిరిన పరస్పర ఒప్పందంలో భాగంగా జరిగింది. బంగ్లాదేశ్ 23 మంది భారత జాలర్లను (9 మంది ఏపీ, 14 మంది పశ్చిమ బెంగాల్) రెండు పడవలతో సహా విడుదల చేయగా, భారత్ కూడా తమ అదుపులో ఉన్న 128 మంది బంగ్లాదేశీ జాలర్లను, ఐదు పడవలను ఆ దేశానికి అప్పగించింది.

భారత్ నుంచి వెనక్కి వెళ్లిన వారిలో గత నవంబర్‌లో ఇంధనం అయిపోయి శ్రీకాకుళం తీరానికి కొట్టుకువచ్చిన 13 మంది బంగ్లా జాలర్లు కూడా ఉన్నారు. విశాఖపట్నం కలెక్టర్ ఆదేశాల మేరకు వారికి కొత్త దుస్తులు అందించి, భారత నేవీ నౌకలో అంతర్జాతీయ సరిహద్దుకు పంపించారు. తమను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాలర్లు, వారి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ యూనియన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ కూడా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.
Go Back to Shorts
AP Fishermen
Andhra Pradesh Fishermen
Bangladesh
Visakhapatnam
Indian Coast Guard
Bay of Bengal
Fishermen Release
S Jaishankar
Vasupalli Janakiram

More Telugu News