Stree Shakti: స్త్రీశక్తి బస్సుల్లో కండక్టర్లకు పవర్ బ్యాంక్‌లు

Stree Shakti Bus Conductors Get Power Banks for ePOS Machines
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీశక్తి పథకం అమలవుతున్న బస్సుల్లోని ఈ-పాస్ యంత్రాల బ్యాటరీ సామర్థ్యం 3,300 ఎంఏహెచ్ మాత్రమే ఉండటంతో, ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న బస్సుల్లో టికెట్ల జారీకి మాత్రమే ఛార్జింగ్ సరిపోతోంది. దీనివల్ల రియల్ టైమ్ జీపీఎస్ ట్రాకింగ్ నిర్వహించడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో ఉచిత టికెట్లు ఇవ్వడం సాధ్యపడకపోవడంతో కండక్టర్లు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు, కండక్టర్ల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి.

ఈ సమస్యను పరిష్కరించేందుకు యాజమాన్యం కండక్టర్లకు వినియోగంలో ఉన్న ఈపోస్‌ యంత్రాలతో పాటు అదనంగా పవర్ బ్యాంకులు అందజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం టికెట్ల జారీతో పాటు జీపీఎస్ ట్రాకింగ్‌కు ఈపోస్‌ యంత్రాలను వినియోగిస్తుండటంతో బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. జీపీఎస్ ట్రాకింగ్ నిరంతరం కొనసాగేందుకు 20 వేల ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉన్న మొత్తం 17,880 పవర్ బ్యాంకులను కొనుగోలు చేసి కండక్టర్లకు అందజేయాలని యాజమాన్యం నిర్ణయించింది.

ఈ పవర్ బ్యాంకులను గుంటూరు-11 డిపోలో ప్రయోగాత్మకంగా అమలు చేయగా, బ్యాటరీ బ్యాకప్ సమర్థవంతంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అన్ని డిపోల్లో స్త్రీశక్తి పథకం అమలవుతున్న బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లకు ఈ పవర్ బ్యాంకులు అందజేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. 
Go Back to Shorts
Stree Shakti
APSRTC
APSRTC Stree Shakti
Power Banks
ePOS machines
Bus Conductors
GPS Tracking
Guntur
Andhra Pradesh

More Telugu News