అమరావతిలో మరో కదలిక.. రెండో విడత ల్యాండ్ పూలింగ్కు వడ్డమాను రైతుల గ్రీన్ సిగ్నల్
- అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్కు కదలిక
- వడ్డమాను గ్రామంలో భూములిచ్చేందుకు రైతుల అంగీకారం
- మంత్రికి పాసుపుస్తకాల అందజేత
ఈ సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని పరిధిలోని ఏడు గ్రామాల్లో ఇంకా 16,666 ఎకరాలకు పైగా భూమిని సమీకరించాల్సి ఉందని తెలిపారు. 2014-19 మధ్య కాలంలో రైతుల సలహాలు, సూచనలతోనే భూ సమీకరణ విధానాన్ని రూపొందించామని, ఇప్పుడు కూడా వారితో చర్చించి, వారి నిర్ణయాల ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులు, ఇతర కారణాల వల్ల రాజధాని పనుల్లో జాప్యం జరిగిందని అన్నారు.
గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించాలని రైతులు కోరగా, వాటిని వెంటనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాజధానిలోని 29 గ్రామాలను అభివృద్ధి చేయడానికి రూ.900 కోట్లు అవసరమని, తొలి దశలో భాగంగా ఆరు నెలల్లో తొమ్మిది గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఆదేశాలు జారీ చేశామని వివరించారు. రైతులు కోరిన విధంగా వడ్డమాను గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు.