టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

Mohammed Shami Gets Notice From Supreme Court in Alimony Case
  • భరణం పెంచాలంటూ సుప్రీంను ఆశ్రయించిన భార్య హసీన్ జహాన్
  • కలకత్తా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషన్
  • షమీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికీ నోటీసులు
  • నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని ఆదేశం
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ, ఆయన భార్య హసీన్ జహాన్‌ల మధ్య కొనసాగుతున్న భరణం వివాదం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. భరణం మొత్తాన్ని పెంచాలని కోరుతూ హసీన్ జహాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌కు సంబంధించి మహ్మద్ షమీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కూడా సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా దీనిపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది.

గతంలో కలకత్తా హైకోర్టు, హసీన్ జహాన్‌కు నెలకు రూ. 1.5 లక్షలు, వారి కుమార్తె సంరక్షణ కోసం రూ. 2.5 లక్షలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశించింది. అయితే, ఈ మొత్తం తమ అవసరాలకు సరిపోవడం లేదని, భరణాన్ని మరింత పెంచాలని కోరుతూ హసీన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, తాజాగా ఈ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల తర్వాత ఈ కేసుపై తదుపరి విచారణ జరగనుంది.

మహ్మద్ షమీ, హసీన్ జహాన్‌ల మధ్య 2018 నుంచి వ్యక్తిగత, న్యాయపరమైన వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో షమీపై మ్యాచ్ ఫిక్సింగ్, గృహ హింస, వరకట్న వేధింపుల వంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలతో షమీపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. అయితే, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి బీసీసీఐ అతనికి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, వారి మధ్య వ్యక్తిగత వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

గతంలో తన వివాహం గురించి అడిగినప్పుడు షమీ స్పందిస్తూ.. "గడిచిపోయిన దాని గురించి నేను చింతించను. ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదు. నా పూర్తి దృష్టి నా క్రికెట్‌పైనే ఉంటుంది. నాకు ఈ వివాదాలు వద్దు" అని వ్యాఖ్యానించాడు. తాజా సుప్రీంకోర్టు నోటీసులతో వీరి వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 
Go Back to Shorts
Mohammed Shami
Hasin Jahan
Supreme Court
Alimony case
Indian Cricketer
Domestic Violence
Kolkata High Court
West Bengal Government
BCCI
Cricket

More Telugu News