కర్నూలు బస్సు ప్రమాదం: 19 వాహనాలకు కనిపించిన బైక్.. ఆ ఒక్క డ్రైవర్‌కే కనపడలేదా?

Kurnool Bus Accident Why only the bus driver didnt see the bike
  • కర్నూలు బస్సు ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీసుల అనుమానం
  • ప్రమాదానికి 10-15 నిమిషాల ముందు 19 వాహనాలు బైక్‌ను తప్పించుకున్న వైనం
  • విచారణలో పొంతనలేని సమాధానాలు ఇస్తున్న బస్సు డ్రైవర్ లక్ష్మయ్య
  • రోడ్డుపై బైక్ పడి ఉండటం చూశామని చెప్పిన ఇతర డ్రైవర్లు
  • ఫోరెన్సిక్, ఆర్టీఏ నివేదికల కోసం ఎదురుచూస్తున్న దర్యాప్తు అధికారులు
  • మృతుల అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ప్రమాదానికి గురైన బంధువులు
కర్నూలు సమీపంలో 19 మందిని బలిగొన్న బస్సు ప్రమాద ఘటనలో విచారణ వేగవంతమైంది. డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర దుర్ఘటన జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ముందు కేవలం 10-15 నిమిషాల వ్యవధిలో అదే మార్గంలో ప్రయాణించిన 19 భారీ వాహనాలు రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను గుర్తించి, దానిని తప్పించుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, అంతమందికి కనిపించిన బైక్ కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌కు ఎందుకు కనిపించలేదనే ప్రశ్న తలెత్తుతోంది.

గత శుక్రవారం తెల్లవారుజామున 2:45 గంటలకు శివశంకర్, ఎర్రిస్వామి అనే ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై వెళ్తూ చిన్నటేకూరు వద్ద డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైకర్ శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఎర్రిస్వామి గాయపడ్డాడు. వారి బైక్ రోడ్డు మధ్యలోనే పడిపోయింది. సరిగ్గా 10-15 నిమిషాల తర్వాత, అంటే 2:55 నుంచి 3 గంటల మధ్య, బెంగళూరు వైపు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డుపై ఉన్న బైక్‌ను గుర్తించకుండా పైనుంచి దూసుకెళ్లింది. దీంతో బైక్ బస్సు కింద ఇరుక్కుని, ఘర్షణకు గురై మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

డ్రైవర్ పొంతన లేని సమాధానాలు
ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లక్ష్మయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులకు అతను పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. మొదట బైకర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టాడని, ఆ తర్వాత ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టానని రకరకాలుగా చెప్పాడు. అయితే, ప్రమాదానికి ముందు యువకులు పెట్రోల్ బంకులో ఉన్న సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో అసలు విషయం అంగీకరించాడు. వర్షం, చీకటి కారణంగా నల్లరంగు బైక్‌ను గుర్తించలేకపోయానని, దగ్గరకు వచ్చాక సడెన్ బ్రేక్ వేస్తే వెనుక వాహనాలు ఢీకొడతాయనే భయంతో బైక్ పైనుంచే బస్సును పోనిచ్చానని చెప్పినట్లు సమాచారం.

కీలకంగా మారిన ఇతర డ్రైవర్ల వాంగ్మూలం 
లక్ష్మయ్య వాదనను పోలీసులు విశ్వసించడం లేదు. ప్రమాద సమయంలో ఆ మార్గంలో వెళ్లిన నలుగురు లారీ, బస్సు డ్రైవర్లను విచారించగా, వారు కీలక సమాచారం ఇచ్చారు. "రోడ్డుకు అడ్డంగా ఓ బైక్ పడి ఉంది. స్పృహలో లేని యువకుడిని మరో వ్యక్తి పక్కకు లాగడం మేము గమనించాం. వెంటనే బైక్‌ను తప్పించుకుని ముందుకు వెళ్లాం" అని వారు పోలీసులకు వివరించారు. అంతమంది డ్రైవర్లకు కనిపించిన బైక్, లక్ష్మయ్యకు కనిపించలేదని చెప్పడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రోడ్డు రవాణా, అగ్నిమాపక, ఫోరెన్సిక్ విభాగాల నుంచి నివేదికలు అందాల్సి ఉంది. అవి రాగానే దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని అధికారులు తెలిపారు.

మరో విషాదం
ఇదిలా ఉండగా, ఈ బస్సు ప్రమాదంలో మరణించిన నెల్లూరు జిల్లాకు చెందిన గోళ్ల రమేశ్, అనూష దంపతులు, వారి పిల్లల అంత్యక్రియలు సోమవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న వారి బంధువుల కారు టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి గోడను ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఒకే కుటుంబంలో చోటుచేసుకున్న వరుస విషాదాలు స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురిచేశాయి.
Go Back to Shorts
Kurnool bus accident
Lakshmaiah
Kurnool
bus accident
Andhra Pradesh
road accident
bike accident
Kaveri travels
fire accident
Nellore

More Telugu News