ఇండియా పోస్ట్ సంచలనం...దేశంలో ఎక్కడికైనా 24 గంటల్లో పార్శిల్ డెలివరీ!

India Post to Deliver Parcels in 24 Hours Nationwide by 2026
షార్ట్స్‌లో చూడండి
భారత తపాలా శాఖ తన సేవలను ఆధునికీకరించే దిశగా ఒక భారీ ముందడుగు వేస్తోంది. ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు దీటుగా, దేశంలో ఏ మూలకైనా కేవలం 24 గంటల్లో పార్శిళ్లను చేరవేసే కొత్త విధానాన్ని తీసుకురానుంది. 2026 జనవరి నాటికి ఈ సరికొత్త స్పీడ్ డెలివరీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఇండియా పోస్ట్ ద్వారా వేగంగా పంపినా, పార్శిల్ చేరడానికి మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా మంత్రి సింధియా మరిన్ని వివరాలు వెల్లడించారు. దేశంలోని అన్ని మెట్రో నగరాలు, రాష్ట్ర రాజధానుల్లో 48 గంటల్లో గ్యారెంటీ డెలివరీ సేవలను కూడా 2026 జనవరి నాటికి ప్రారంభిస్తామని తెలిపారు. అంతేకాకుండా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. 2026 మార్చి నాటికి ఈ సంస్థలకు చెందిన వస్తువులను వినియోగదారుల ఇళ్లకు చేర్చే 'లాస్ట్-మైల్ డెలివరీ' సేవలను కూడా ఇండియా పోస్ట్ అందిస్తుందని ఆయన వివరించారు.

ఇటీవలే, దాదాపు రెండు నెలల విరామం తర్వాత అమెరికాకు అన్ని రకాల అంతర్జాతీయ పోస్టల్ సేవలను అక్టోబర్ 15 నుంచి తపాలా శాఖ తిరిగి ప్రారంభించింది.

దేశవ్యాప్తంగా సుమారు 1,64,999 పోస్టాఫీసులతో ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఇండియా పోస్ట్ కొనసాగుతోంది. ఈ విస్తృతమైన నెట్‌వర్క్ కారణంగా దేశంలోని ప్రతి గ్రామానికి 5 కిలోమీటర్ల పరిధిలోనే ఒక పోస్టాఫీసు అందుబాటులో ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఈ కొత్త సేవలతో పొదుపు, బీమా, ప్రభుత్వ పథకాలతో పాటు ఆధునిక డిజిటల్ సేవలు కూడా మారుమూల ప్రాంతాల ప్రజలకు మరింత చేరువ కానున్నాయి.
Go Back to Shorts
Jyotiraditya Scindia
India Post
postal service
parcel delivery
speed post
e-commerce
last mile delivery
postal network
logistics
delivery service

More Telugu News