Chandrababu Naidu: ఏపీ విద్యుత్ సంస్కరణలు దేశానికే ఆదర్శం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu AP Electricity Reforms a Model for the Nation
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌ను ఇంధన స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడంతో పాటు, విశాఖపట్నంను ఒక ప్రముఖ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇంధన పరివర్తన ప్రణాళికపై (స్టేట్ ఎనర్జీ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్) ప్రభుత్వం, నీతి ఆయోగ్, మరియు ఐఎస్‌ఈజీ ఫౌండేషన్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.

విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యుత్ రంగంలో గతంలో చేపట్టిన సంస్కరణలను గుర్తుచేశారు. ఏపీ విద్యుత్ సంస్కరణలు దేశానికే ఆదర్శమని అన్నారు. "1998లోనే దేశంలో తొలిసారిగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. 2014లో పునరుత్పాదక ఇంధనానికి ప్రాధాన్యత ఇచ్చాం, అదే ఇప్పుడు అత్యంత చవకైన విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమం చేసింది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో, దానిని విద్యుత్ రంగంలో వినియోగించుకుని అద్భుతాలు సాధించాం," అని ఆయన అన్నారు. ప్రజలే విద్యుత్ ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా మారేలా నూతన విధానాలను అమలు చేస్తున్నామని, దీనివల్ల విద్యుత్ సరఫరా నష్టాలుండవని ముఖ్యమంత్రి వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగితే రవాణా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

సౌర, పవన విద్యుత్‌తో పాటు పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందుకు అవసరమైన వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆశయాలు నెరవేర్చడంలో నీతి ఆయోగ్ సహకారం కూడా అవసరమని ఆయన కోరారు.

పెరుగుతున్న డిమాండ్, పెరుగుతున్న ఉత్పత్తి సామర్థ్యం
ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 27.3 గిగావాట్లుగా ఉంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 2019లో 55.6 బిలియన్ యూనిట్లు ఉండగా, 2025 నాటికి ఇది 69.7 బిలియన్ యూనిట్లకు చేరింది. ఇందులో పారిశ్రామిక రంగానికి 4.8 శాతం, గృహ వినియోగానికి 5.1 శాతం మేర డిమాండ్ పెరిగింది. రాబోయే సంవత్సరాల్లో ఈ డిమాండ్ మరింత పెరగనుంది. వచ్చే ఏడాదికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 88.6 బిలియన్ యూనిట్లకు, 2035 నాటికి 163.9 బిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా.

క్లీన్ ఎనర్జీ లక్ష్యాలు - భారీ పెట్టుబడులు
ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2029 నాటికి 78.50 గిగావాట్ల సౌర విద్యుత్, 35 గిగావాట్ల పవన విద్యుత్, 22 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్, 1.50 ఎంఎంపీటీఏ (మిలియన్ మెట్రిక్ టన్నుల పర్ యానం) గ్రీన్ హైడ్రోజన్, 25 గిగావాట్ల బ్యాటరీ స్టోరేజ్, 1,500 కేఎల్‌పీడీ (కిలో లీటర్ల పర్ డే) ఇథనాల్, 5,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, మరియు 10,000 టీపీడీ (టన్నుల పర్ డే) బయో సీఎన్జీ-సీబీజీ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు.

క్లీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.5.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని, దీని ద్వారా 57.7 గిగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికారులు తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఐఎస్‌ఈజీ ఫౌండేషన్ ప్రతినిధులు, ఇంధన శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంను ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు, ఇంధన రంగంలో స్వావలంబన సాధించడం ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఈ నిర్ణయాలు దోహదపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
AP electricity reforms
NITI Aayog
renewable energy
clean energy
Visakhapatnam
energy sector
Gottipati Ravikumar
BVR Subrahmanyam

More Telugu News