వర్షాల కోసం తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం.. ముహూర్తం ఫిక్స్
- ఆగస్టు 10న నాగార్జునసాగర్లో వరుణయాగం
- యాగం నిర్వహించనున్న యాదగిరిగుట్ట ఆలయ వేద పండితులు, అర్చకులు
- పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి నదులు, జలాశయాలు జలకళ సంతరించుకోవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఆగస్టు 10వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని విజయ విహార్ ప్రాంగణంలో ఈ యాగం వైభవంగా జరగనుంది. ఎల్ నినో ప్రభావం నుంచి విముక్తి కలిగి, కృష్ణా-గోదావరి నదులతో పాటు రైతాంగం సుభిక్షంగా ఉండాలనే ప్రత్యేక సంకల్పంతో ఈ మహా క్రతువును చేపడుతున్నారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన వేద పండితులు, అర్చకులతో పాటు మొత్తం 108 మంది రుత్వికులు 11 హోమకుండాలలో ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. రాష్ట్ర శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ మహా వరుణ యాగాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి చైర్మన్ తెలిపారు.