ఈసారి మనపై దాడి చేస్తే పాకిస్థాన్ కు అదే చివరి రోజు అవుతుంది: సీఎం చంద్రబాబు
- ఆపరేషన్ సిందూర్ విజయవంతం
- విజయవాడలో తిరంగా ర్యాలీ
- హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
సైనిక దళాలకు సెల్యూట్
పహల్గామ్ ఘటన గుర్తుకురాగానే మనలో పౌరుషం, ఉద్వేగం వస్తుంది. భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని మతం పేరు అడిగి మరీ చంపేశారు. ఆడబిడ్డల నుదుట తిలకం తుడిచిన ఉగ్రవాదులు ఈ భూమి మీద ఉండకూడదని ఆపరేషన్ సిందూర్ కు శ్రీకారం చుట్టాం. ఉగ్రవాదంపై పోరాడుతున్న మన సైనిక దళాలకు సెల్యూట్ చేస్తున్నాను. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న జవాన్లకు నమస్కరిస్తున్నాను. వారి పోరాటం వల్లే మనం క్షేమంగా ఉన్నాం. మన దేశ గౌరవం, బలం, బలగం సాయుధ బలగాలే. రక్షణ దళాలు... ఉగ్రవాదులు ఈ దేశంపై కన్నెత్తి చూడకుండా పోరాడాయి. మన సైనికులను చూసి ఏపీనే కాదు... దేశమంతా గర్విస్తోంది. మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ జెండా చూడగానే మనందరిలో ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి కలుగుతుంది. ఆ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వారే కావడం మనందరికీ గర్వకారణం.
ఉగ్రవాదంపై ప్రధాని మోదీ రాజీలేని పోరాటం
మన దేశానికి సరైన సమయంలో దొరికిన సమర్థ నాయకుడు ప్రధాని మోదీ. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. మనం ఎప్పుడూ ఇతర దేశాలపై యుద్ధాలకు వెళ్లం. మన జోలికి వస్తే మాత్రం తగిన బుద్ధి చెప్పితీరుతాం. ప్రధాని మోదీ ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడా దాక్కున్నా తుదముట్టించేందుకు ప్రధాని సంకల్పం తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తో శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తీవ్రవాద రూపంలో మనదేశానికి వస్తే అదే వారికి చివరిరోజవుతుంది. మన దేశం రక్షణలోనే కాదు ఆర్థిక శక్తిగానూ ఎదుగుతోంది. కుట్రలు, కుతంత్రాలు, అసూయ పడేవారెవరూ మన దేశాన్ని ఏం చేయలేరు. 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశం మొదటి లేదా రెండో స్థానాల్లో నిలుస్తుంది. దేశ భద్రత, సమగ్రత కోసం మనమంతా ఏకతాటిపై నడవాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ స్పూర్తితో ముందుకు వెళదాం అని సీఎం చంద్రబాబు అన్నారు.
