Donald Trump: భారత్-పాక్ కాల్పుల విరమణ: అమెరికా కీలక పాత్ర

India and Pakistan Ceasefire Trump Announces Breakthrough

  • భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
  • తొలుత ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ధ్రువీకరణ
  • అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలకు ఇరు దేశాల అంగీకారం

అణుశక్తి దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత ప్రకటించడం అంతర్జాతీయంగా ఆసక్తి రేపింది. కొద్ది సేపటికే, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. "రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓలు) మధ్యాహ్నం 3:35 గంటలకు చర్చలు జరిపారు. భూమి, సముద్రం, గగనతలంలో అన్ని రకాల కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించారు. తదుపరి చర్చలు మే 12న జరుగుతాయి" అని మిస్రీ తెలిపారు.

అయితే, ఈ పరిణామం అనూహ్యంగా చోటుచేసుకుంది. కేవలం ఒక రోజు ముందే, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, భారత్-పాకిస్థాన్ వివాదం "ప్రాథమికంగా మాకు  సంబంధం లేని విషయం" అని వ్యాఖ్యానించారు. అయితే, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ట్రంప్, తాను ఇరు దేశాలను ప్రోత్సహిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు. కానీ, ట్రంప్ స్వయంగా ఎక్స్ మరియు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా కాల్పుల విరమణ ప్రకటన చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ట్రంప్ ప్రకటన అనంతరం, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా ఎక్స్‌లో ఇదే విధమైన పోస్ట్ చేస్తూ కాల్పుల విరమణను ధృవీకరించారు. "గత 48 గంటలుగా, ఉపాధ్యక్షుడు వాన్స్ మరియు నేను భారత, పాకిస్థాన్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపాం. ప్రధానులు నరేంద్ర మోదీ, షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, అసిమ్ మాలిక్‌లతో చర్చించాం" అని రూబియో వివరించారు. తక్షణ కాల్పుల విరమణకు, తటస్థ వేదికపై విస్తృత అంశాలపై చర్చలు ప్రారంభించడానికి భారత, పాకిస్థాన్ ప్రభుత్వాలు అంగీకరించినందుకు సంతోషంగా ఉందని, శాంతి మార్గాన్ని ఎంచుకున్నందుకు ప్రధానులు మోదీ, షరీఫ్‌ల విజ్ఞత, దార్శనికతను అభినందిస్తున్నామని ఆయన అన్నారు.

ఈ కాల్పుల విరమణ ప్రకటన వెలువడటానికి ముందు, పాకిస్థాన్ భవిష్యత్తులో ఏదైనా ఉగ్రచర్యకు పాల్పడితే దాన్ని యుద్ధ చర్యగా పరిగణించి, తదనుగుణంగా స్పందిస్తామని భారత్ కీలక హెచ్చరిక జారీ చేసింది. గత మూడు రాత్రులుగా ఉత్తర భారతదేశంలోని సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలపై పాకిస్థాన్ డ్రోన్, క్షిపణి దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం (మే 12) భారత్, పాక్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పుడు కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం, తదుపరి చర్చలు ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుతాయని ఆశిస్తున్నారు.

Donald Trump
India-Pakistan ceasefire
Operation Sindoor
Indo-Pak conflict
US role in India-Pakistan peace
Narendra Modi
Shehbaz Sharif
Vikram Misri
Marco Rubio
ceasefire agreement
India Pakistan relations
  • Loading...

More Telugu News