Indian Army: పాక్ భూభాగంలోని ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేసిన భారత సైన్యం.. వీడియో ఇదిగో!

- సరిహద్దుల్లో పాక్ కవ్వింపులకు దీటుగా జవాబిచ్చిన ఆర్మీ
- నియంత్రణ రేఖ వద్ద ఉగ్ర స్థావరాలు ధ్వంసం
- పాక్ సైనిక మౌలిక వసతులపై భారత వైమానిక దాడులు
నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద పాకిస్థాన్ పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో, భారత సాయుధ దళాలు పాకిస్థాన్ సైనిక మౌలిక వసతులపై తీవ్రస్థాయిలో దాడులు చేసి గట్టి దెబ్బతీశాయి. జమ్మూకశ్మీర్ మరియు పంజాబ్లోని పలు నగరాలపై పాకిస్థాన్ రాత్రిపూట డ్రోన్ దాడులకు యత్నించిన నేపథ్యంలో భారత సైన్యం ఈ ప్రతీకార చర్యలు చేపట్టింది.
"మే 8, 9 తేదీలలో రాత్రిపూట జమ్మూకశ్మీర్, పంజాబ్లోని పలు నగరాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులకు పాల్పడేందుకు దుస్సాహసం చేసింది. దీనికి ప్రతిస్పందనగా భారత బలగాలు ఉగ్రవాద ప్రయోగ కేంద్రాలపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేశాయి" అని భారత సైన్యం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న ఈ ఉగ్రవాద ప్రయోగ కేంద్రాలు గతంలో భారత పౌరులు, భద్రతా దళాలపై దాడులకు కేంద్రాలుగా పనిచేశాయని సైన్యం పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను సైన్యం అప్ లోడ్ చేసింది.