Sourav Ganguly: పాకిస్థాన్ కు అంత సీన్ లేదు: గంగూలీ

- ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా
- బీసీసీఐ నిర్ణయం సరైనదేనన్న గంగూలీ
- ఒత్తిడిని ఎక్కువ కాలం తట్టుకునే సత్తా పాకిస్థాన్ కు లేదని వ్యాఖ్య
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ను వాయిదా వేస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో, క్రికెటర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ చర్య చేపట్టినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.
దాయాది దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో, ఇలాంటి సమయంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సముచితం కాదని బీసీసీఐ భావించింది. ఐపీఎల్లో కేవలం భారత ఆటగాళ్లే కాకుండా, పలువురు విదేశీ క్రికెటర్లు కూడా పాల్గొంటున్నందున, వారి భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్ ప్రస్తుతం కీలక దశలో ఉందని, ధర్మశాల, చండీగఢ్, ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లో జరగాల్సిన ముఖ్యమైన మ్యాచ్లు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ పరిణామాలపై భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ స్పందిస్తూ, "ప్రస్తుత దేశ పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే. ఆటగాళ్ల భద్రత చాలా ముఖ్యం. గత మ్యాచ్ సమయంలో ఏం జరిగిందో మనం చూశాం. అయితే, త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి. ఐపీఎల్ 2025 సీజన్ తప్పకుండా పునఃప్రారంభమవుతుంది. ఒత్తిడిని ఎక్కువ కాలం తట్టుకునేంత సత్తా పాకిస్థాన్కు లేదు" అని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ) సభ్యుడు సంజయ్ శర్మ మాట్లాడుతూ, "భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది. భద్రతా కారణాల రీత్యా పంజాబ్, ఢిల్లీ మధ్య జరగాల్సిన మ్యాచ్ను మధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీతో మేం నిరంతరం సమన్వయం చేసుకుంటున్నాం. బీసీసీఐ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం" అని తెలిపారు.