Sajjala Sreedhar Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు: సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్

- ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో సిట్ దూకుడు
- నిన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్
- నేడు విజయవాడలో ఏసీబీ కోర్టులో హాజరు
- మే 6 వరకు జ్యడిషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి
ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మే 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అతడిని విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు.
ఈ కేసులో ఆరో నిందితుడిగా (ఏ6) ఉన్న శ్రీధర్రెడ్డిని సిట్ అధికారులు నిన్న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విజయవాడకు తరలించి, నేడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి, శ్రీధర్రెడ్డికి మే 6 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించి జరిగిన కుట్రలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారం చేపట్టిన తర్వాత, కొత్త మద్యం విధానం పేరుతో నెలనెలా రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు అక్రమంగా ముడుపులు వసూలు చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుట్రలో భాగంగా జరిగిన కీలక సమావేశాల్లో శ్రీధర్రెడ్డి కూడా పాల్గొన్నారని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశాల్లో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డి, నాటి ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్ కెసిరెడ్డి, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అదే సంస్థ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ వంటి వారు కూడా పాల్గొన్నట్లు కేసు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలోనే సిట్ అధికారులు శ్రీధర్రెడ్డిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.