Telangana Ministers: సభా ప్రాంగణంలో దిగిన హెలికాప్టర్.. మంత్రులకు తప్పిన ముప్పు.. వీడియో ఇదిగో!

- బందోబస్తు ఏర్పాట్లలో ఉన్న పోలీసులకు గాయాలు
- ల్యాండింగ్ సమయంలో భారీగా ఎగిసిపడిన దుమ్ము
- నిజామాబాద్ రైతు మహోత్సవ వేడుకల్లో అధికారుల సమన్వయ లోపం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. సోమవారం నిజామాబాద్ లో తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముగ్గురు మంత్రులు హెలికాప్టర్ లో బయలుదేరారు. అయితే, అధికారుల సమన్వయలోపంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్.. సభా ప్రాంగణం మధ్యలో దిగింది. ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తోరణాలు కూలిపోయాయి. దీంతో బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమైన పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. భారీగా ఎగిసిపడ్డ దుమ్ముతో సభకు వచ్చిన జనం ఇబ్బంది పడ్డారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో హాజరవుతున్నట్లుగా అధికారులకు సమాచారం అందింది. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం కలెక్టరేట్ లో ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ విషయంలో అధికారుల సమన్వయ లోపం కారణంగా పైలట్ హెలికాప్టర్ ను సభా ప్రాంగణంలోనే దించేశాడు. హెలికాప్టర్ రెక్కల నుంచి గాలి కారణంగా భారీగా దుమ్ము ఎగిసిపడింది. దీంతో సభా ప్రాంగణంలో జనం పరుగులు తీశారు. అదేవిధంగా మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. పంట ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేసిన 150 స్టాళ్లలో కొన్ని చిందరవందరగా పడిపోయాయి.