Raj Kasi Reddy: విజయసాయి ఒక బట్టేబాజ్... త్వరలోనే అతడి చరిత్ర మొత్తం చెబుతా: రాజ్ కసిరెడ్డి

- ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు
- ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు ఇచ్చిన సిట్
- అజ్ఞాతం నుంచి ఆడియో సందేశం వెలువరించిన రాజ్ కసిరెడ్డి
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి తాజాగా ఓ ఆడియో సందేశం వెలువరించారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణల పట్ల ఆయన ఈ ఆడియో క్లిప్పింగ్ ద్వారా బదులిచ్చారు. ఏపీ లిక్కర్ స్కాంను దర్యాప్తు చేస్తున్న సిట్ వరుస నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో, రాజ్ కసిరెడ్డి అజ్ఞాతం నుంచి ఆడియో సందేశం పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆడియో క్లిప్పింగ్ లో రాజ్ కసిరెడ్డి ఏమన్నారంటే... "లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సిట్ అధికారులు నాకు రెండు సార్లు నోటీసులు పంపారు. నాపై వచ్చిన ఆరోపణల పట్ల నేను న్యాయపరంగా పోరాటం చేస్తున్నా. సిట్ నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. నిర్ణీత సమయం ఇచ్చి నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. న్యాయపరమైన రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ముందస్తు బెయిల్ కోసం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నా.
మద్యం కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదు. న్యాయపోరాటం ముగిశాక మీడియాను పిలిచి విజయసాయిరెడ్డి చరిత్ర మొత్తం చెబుతా" అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజ్ కసిరెడ్డి... విజయసాయిని 'బట్టేబాజ్ మనిషి' అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఒకవైపు వాదనలు విని మీడియాలో వార్తలు ప్రసారం చేయొద్దని, తన వాదన కూడా వినాలని, త్వరలోనే మీడియా ముందుకు వచ్చి విజయసాయి వ్యవహారంతో సహా అన్ని విషయాలు చెబుతానని వెల్లడించారు.
కాగా, సిట్ నోటీసులకు తాను స్పందించానని రాజ్ కసిరెడ్డి వెల్లడించారు. నోటీసులపై తన న్యాయవాదులను సంప్రదించగా, సిట్ మిమ్మల్ని సాక్షిగా పేర్కొంటోందని, అయితే అరెస్ట్ చేసే అవకాశముందని వారు చెప్పారని వివరించారు. తనకు సిట్ రెండుసార్లు నోటీసులు ఇచ్చిందని కసిరెడ్డి ఆడియోలో అంగీకరించారు. మొదటి నోటీసు తాను లేని సమయంలో తన తల్లికి ఇచ్చారని, రెండో నోటీసు మెయిల్ ద్వారా పంపి మరుసటి రోజే విచారణకు రమ్మన్నారని తెలిపారు. విచారణకు సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే తనను ఎందుకు విచారణకు పిలుస్తున్నారో స్పష్టం చేయాలని సిట్ ను కోరినట్లు తెలిపారు.