Advertisement

ఇవాళ రెండు కీలక సమావేశాలు జరిగాయి: ఢిల్లీలో చంద్రబాబు

Chandrababu press meet after meetings with union ministers
  • ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
  • అమిత్ షా, నిర్మలా సీతారామన్, గడ్కరీలతో సమావేశం
  • వివిధ అంశాలపై చర్చించామన్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్రమంత్రులతో సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇవాళ రెండు కీలక సమావేశాలు జరిగాయని అన్నారు. రాజకీయ పరిణామాల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించామని చెప్పారు. మున్ముందు ఎన్డీయే కూటమి ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించామని తెలిపారు. 

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు గురించి చర్చించామని, భూములకు సంబంధించి కంప్యూటరైజేషన్ లో కొన్ని సమస్యలు వచ్చిన విషయం వివరించామని చంద్రబాబు వెల్లడించారు. గతంలో నాయకులు, అధికారులు కలిసిపోయారని, ప్రైవేటు భూములను బలవంతంగా 22ఈ లో చేర్చారని తెలిపారు. గతంలో అటవీ భూములు కూడా ఆక్రమించారని పేర్కొన్నారు. 

కాగా, గుజరాత్ లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును విజయవంతంగా అమలు చేశారని... ఏపీలోనూ బిల్లు తీసుకువచ్చామని అన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును త్వరగా ఆమోదించాలని అమిత్  షాను కోరామని చంద్రబాబు చెప్పారు. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లులో పట్టణ, గ్రామీణ భూములు ఉన్నాయని తెలిపారు. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు వచ్చాక భూ అక్రమాలపై పీడీ కేసులు పెడతామని స్పష్టం చేశారు. 

ఏపీలో గంజాయి, డ్రగ్స్ పెద్ద సమస్యగా ఉన్నాయని వెల్లడించారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు వ్యవస్థలు ఏర్పాటు చేశామని అన్నారు. గంజాయి కట్టడి చేస్తే ఉపాధితో పాటు ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని ప్రకటించారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు మరో బిల్లు తీసుకువస్తున్నామని చంద్రబాబు వివరించారు. రెండు బిల్లుల గురించి కేంద్ర మంత్రులతో చర్చించామని తెలిపారు. 

"గత ప్రభుత్వ హయాంలో భారీగా అధికార దుర్వినియోగం జరిగింది. పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలు చోటుచేసుకున్నాయి. గత సర్కారు రూ.10 లక్షల కోట్ల అప్పులు, బకాయిలు మిగిల్చి వెళ్లింది. రుణాలు తీసుకునే సామర్థ్యం ఏపీకి జీరోగా ఉందని నీతి ఆయోగ్ వెల్లడించింది. గతంలో ఎఫ్ఆర్ బీఎం పరిధులు కూడా దాటిపోయారు. 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎన్నో ఆశలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికే పట్టం కట్టారు. ఏపీ 12.94 శాతం వృద్ధిరేటుతో ముందుకు వెళుతోంది. ఈ ఏడాది నుంచి 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకు వెళతాం. 

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించాం. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం జరగాలి. నదుల అనుసంధానంతో కరవు ప్రాంతం రాయలసీమకు ప్రయోజనం కలుగుతుంది. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని పోలవరం ప్రాజెక్టుకు వాడుకోవాలని ఆలోచన. గోదావరిని బనకచర్లకు అనుసంధానిస్తే రాయలసీమకు గేట్ వేగా మారుతుంది" అని చంద్రబాబు వివరించారు.
Advertisement
Chandrababu
New Delhi
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News