Happy New Year 2025: తెలుగు ప్రజలకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు: ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu wishes Telugu people happy new year 2025
  • మరి కాసేపట్లో 2025 నూతన సంవత్సర ఆగమనం
  • సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు
  • అందరికీ ఆనందకర, ఆరోగ్యకరమైన జీవితం లభించాలంటూ ట్వీట్
మరికాసేపట్లో భారత్ 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో, ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. తెలుగు ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. 

"2025లో మీకు ఆనందకర, ఆరోగ్యకరమైన జీవితం లభించాలని కోరుకుంటున్నాను. 2024లో మీరు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం... అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పనిచేస్తోంది. కేవలం 6 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలను ఆవిష్కృతం చేశాం. 

పేదల భవిష్యత్ కు భరోసా ఇస్తూ పెన్షన్ల మొత్తాన్ని పెంచాం. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ధాన్యం సేకరణ డబ్బులు 48 గంటల్లోనే చెల్లించి రైతన్నలో సంతోషాన్ని నింపాం. ప్రయాణాలు సాఫీగా సాగాలని రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలు లేకుండా చేస్తున్నాం. నూతన పాలసీలతో మళ్లీ పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నాంది పలికాం. 

కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోంది. స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారమే లక్ష్యంగా 10 సూత్రాల ప్రణాళిక అమలు చేస్తూ అటు ప్రజా సంక్షేమాన్ని, ఇటు రాష్ట్రాభివృద్ధిని మీ అందరి సహకారంతో చేసి చూపిస్తాం... మీ అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ 2025" అంటూ చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Happy New Year 2025
Chandrababu
Telugu People
Andhra Pradesh
TDP-JanaSena-BJP Alliance

More Telugu News