Advertisement

విజయవాడలో నేడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం

NTR Diamond Jubilee In Vijayawada
  • పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో నిర్వహణ
  • ఎన్టీఆర్ తొలి సినిమా మనదేశం విడుదలై 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో వేడుకలు
  • హాజరుకానున్న సినీ, రాజకీయ రంగ ప్రముఖులు
మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నేడు విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దిగ్గజ డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో 1949లో వచ్చిన మనదేశం సినిమాతో ఎన్టీఆర్ నటుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం విడుదలై 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.

సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్టీఆర్ కుమారులు నందమూరి మోహనకృష్ణ, జయకృష్ణతోపాటు సినీ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొంటారని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ‘తారకరామం.. అన్నగారి అంతరంగం’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా లైవ్‌లింక్‌ అందుబాటులో ఉంటుందని జనార్దన్ తెలిపారు. రామకృష్ణ మాట్లాడుతూ రాజకీయాలు, సినీరంగంలో ఎన్టీఆర్ ఒక ధ్రువతార అని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ జీవితచరిత్రను భావితరాలకు పాఠ్యాంశంగా పొందుపరచనున్నట్టు జనార్దన్ తెలిపారు.
Advertisement
NTR
NTR Diamond Jubilee
Vijayawada

More Telugu News