Chandrababu: చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యి నేటికి 30 ఏళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ సంబరాలు

It has been 30 years since Chandrababu became the CM for the first time
రాజకీయ దురంధరుడు, తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన నారా చంద్రబాబునాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నేటికి (సెప్టెంబర్ 1) 30 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఘనంగా సంబరాలు నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి.
 
రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు సిద్దమవుతున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు, టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్‌ బుచ్చిరాంప్రసాద్‌ వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు.

సమాజం పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి, ఆయన ఆలోచనా విధానం, నేటి తరానికి ఆదర్శమని ఈ సందర్భంగా టీడీపీ నేతలు పేర్కొన్నారు. అలాంటి నాయకుడు సీఎంగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించి 30 ఏళ్లు అవుతున్న సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు చేసుకోవడం సముచితమని పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు వంటి రాజకీయ నేత ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని, ఆయన దూరదృష్టికి ఎవరూ సాటి రాలేరని, నేటి తరాలకు ఆదర్శనీయుడు అని టీడీపీ నేతలు కొనియాడారు. తెలుగు ప్రజల ఖ్యాతిని ఉన్నత స్థానంలో ఉంచడమే ఆయన ఏకైక లక్ష్యమని వ్యాఖ్యానించారు.
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News