రేవంత్ రెడ్డి నాతో వచ్చుంటే భారీ పెట్టుబడులు ఇప్పించే వాడిని: కేఏ పాల్
- రేవంత్ రెడ్డి 10 రోజుల పాటు విదేశాల్లో తిరిగి ఇవాళ ఖాళీ చేతులతో వచ్చారని వ్యాఖ్య
- ఒక్క కంపెనీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదన్న పాల్
- ఎన్ని ట్రిప్పులు వేసినా రాజకీయ నేతలను ఎవరూ నమ్మరని రేవంత్కి ఇప్పుడు అర్థమైందంటూ ఎద్దేవా
తాజాగా ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ... "అమెజాన్, మైక్రోసాఫ్ట్తో పాటు ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ పెట్టుబడులు పెట్టాయా? యూఎస్లో కొన్ని వేల కంపెనీలు ఉంటాయి. ఒక్క కంపెనీ అయినా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందా?" అని పాల్ ప్రశ్నించారు.
"సీఎంలందర్నీ అమెరికాకు తీసుకుపోతానని గతంలో రేవంత్ రెడ్డికి చెప్పాను. ఇప్పటికే సీఎంలతో అనేక సమావేశాలు నిర్వహించాను. అమెజాన్, టెస్లా సీఈవోలను కలుద్దామని చెప్పాను. వారం రోజుల్లో ఆస్టిన్, డల్లాస్, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్తో పాటు మరిన్ని నగరాలకు వెళ్దామన్నాను. మాట కూడా ఇచ్చాను.
జనవరి నుంచి ఇప్పటి వరకు నాతో రాలేదు. ఇప్పుడు ఎన్ని ట్రిప్పులు వేసినా రాజకీయ నాయకులను ఎవరూ నమ్మరు అని రేవంత్ రెడ్డికి ఇప్పుడు అర్థమైంది" అని కేఏ పాల్ పేర్కొన్నారు.