వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై ఎఫ్ఐఆర్

Delhi police files FIR on trainee IAS Pooja Khedkar
  • పలు సెక్షన్ల కింద పూజా ఖేద్కర్ పై కేసు నమోదు
  • యూపీఎస్సీ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న ఢిల్లీ పోలీసులు
  • నకిలీ పత్రాలు సమర్పించి పరిమితికి మించి పరీక్షలు రాసినట్టు ఫిర్యాదు
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ పై ఢిల్లీ పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫోర్జరీ, చీటింగ్, ఐటీ చట్టం, దివ్యాంగ చట్టం కింద పూజా ఖేద్కర్ పై కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. నకిలీ గుర్తింపు పత్రాలు సమర్పించి పరిమితికి మించి పరీక్షలు రాశారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 

పూజా ఖేద్కర్ 2023 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి. పూణే కలెక్టర్ కార్యాలయంలో ట్రైనీగా విధులు నిర్వహిస్తూ, తనకు ప్రత్యేక అధికారాలు, సదుపాయాలు కావాలంటూ డిమాండ్ చేయడంతో పాటు, సొంతంగా పలు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. దాంతో ఆమె వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. 

అయితే, తవ్వేకొద్దీ అనేక సంగతులు బయటపడగా, చివరికి పోలీసు కేసు కూడా నమోదైంది. తనకు లోకోమోటార్ వైకల్యం ఉన్నట్టు తీసుకున్న సర్టిఫికెట్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజెబిలిటీస్ (అంగవైకల్య నిర్ధారణ) సర్టిఫికెట్ ను ఆమె గతంలో యూపీఎస్సీకి సమర్పించగా, అవి ఫేక్ అని తాజాగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
Pooja Khedkar
Trainee IAS
FIR
Delhi Police
UPSC

More Telugu News