బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లకు జిరాక్స్ కాపీలు ఇచ్చారా: వైఎస్ జగన్
- ఇటీవలే ఏపీలో బాలకృష్ణ, పవన్ లు భూములు కొన్నారని జగన్ వెల్లడి
- రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒరిజినల్ కాపీలే ఇచ్చామని స్పష్టీకరణ
- ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబు టీమ్ దుష్ర్పచారం చేస్తోందని మండిపాటు
ఇప్పుడు జరగబోయే యుద్ధం రెండు కులాల మధ్య యుద్ధం కాదని, రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమని జగన్ చెప్పారు. పెత్తందారు ఒకవైపు పేదవాళ్లు ఒకవైపు ఉండి పోరాడే యుద్ధమిదని వివరించారు. పేదలకు, అవ్వాతాతలకు పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు టీమ్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. వైద్యం కోసం పేదవాడు ఇబ్బంది పడకుండా, అప్పుల పాలు కాకుండా 25 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని విస్తరించామని తెలిపారు.
గ్రామంలోనే విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు చేసినట్లు జగన్ వివరించారు. ఇంటివద్దకే రేషన్, ఇతర పౌర సేవలు అందించేలా పాలన చేశామని గతంలో ఇలా ఏ నాయకులైనా చేశారా అని ప్రశ్నించారు. ఎన్నడూ లేనివిధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఈ ఐదేళ్లలో కల్పించగలిగామని వెల్లడించారు. మేనిఫెస్టోను ఒక బైబిల్ లా, ఖురాన్ లా, భగవద్గీతలా భావిస్తూ అందులో ఇచ్చిన హామీలను 99శాతం నెరవేర్చామని తెలిపారు. మేనిఫెస్టోను ఇచ్చి ఎన్నికలు అయ్యాక చెత్తబుట్టలో పడేసే చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు.