బాలికా నిలయం సేవా సమాజ్ అమ్మాయిలతో దసరా జరుపుకున్న ఉపాసన-రామ్చరణ్ దంపతులు
- నేడు విజయదశమి
- ఉపాసన కుటుంబం నుంచి వచ్చిన ఓ సంస్కృతిని కొనసాగించిన రామ్ చరణ్
- ఉపాసన బామ్మకు నీరాజనాలు పలుకుతూ దసరా వేడుక
ఉపాసన కుటుంబం తరఫున వచ్చిన ఓ సంస్కృతిని రామ్చరణ్ ఆచరించి కొనసాగించారు. బాలికా నిలయం సేవా సమాజ్లోని అమ్మాయిలతో కలిసి దసరా పర్వదినాన్ని జరుపుకున్నారు. ఉపాసన బామ్మ, ఈ సేవా సమాజ్కి మూడు దశాబ్దాలకు పైగా ఆసరాగా ఉన్నారు. ఆమెకు ట్రిబ్యూట్ ఇచ్చేలా ఉపాసన, రామ్చరణ్ కలిసి బాలికా నిలయం సేవా సమాజ్ లోని అనాథ బాలికలతో కలిసి ఉత్సవాన్ని జరుపుకున్నారు.
ప్రేమను పంచాలి... సానుకూల దృక్పథాన్ని సమాజంలో నాటాలి... సంతోషంగా జీవించాలనే ఆలోచనలను బాలికలలో పెంపొందించేలా స్టార్ కపుల్ ఈ పర్వదినాన్ని నిర్వహించుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని అత్యంత వైభవంగా చాటిచెప్పారు.
ఉపాసన, రామ్చరణ్ దంపతులకు ఇటీవల పండంటి పాపాయి జన్మించిన విషయం తెలిసిందే. పాపకు క్లీంకార కొణిదెల అని పేరు పెట్టుకున్నారు. తరతరాలుగా వస్తున్న సంస్కృతులను, సంప్రదాయాలను గౌరవిస్తూ, కుటుంబ విలువలను పరిరక్షించుకునేలా స్టార్ కపుల్ పండుగను చేసుకున్న తీరుకు అందరూ ముచ్చటపడుతున్నారు.
మహిళా సాధికారతను అత్యంత అద్భుతంగా కొనియాడే పండుగ దసరా. స్త్రీశక్తికున్న ప్రాధాన్యతను నవరాత్రుల్లో వర్ణించే శోభ ఈ పండుగ సొంతం. ఉపాసన, రామ్చరణ్ దంపతులు ఆ స్ఫూర్తిని జనాలకు పంచేలా, స్త్రీ శక్తిని ప్రశంసించేలా, ప్రోత్సహించేలా, కొనియాడేలా ఈ పర్వదినాన్ని జరుపుకున్నారు.