కాంగ్రెస్, ప్రధాని మోదీపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

Harish Rao accuses PM Modi for comments on Telangana
  • కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఆరు నెలలకు ఓ సీఎం మారుతారని ఎద్దేవా
  • కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అని కాంగ్రెస్‌కు ప్రశ్న
  • అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణపై మోదీ విషం చిమ్ముతున్నారని ఆగ్రహం
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరునెలలకు ఓ ముఖ్యమంత్రి మారుతారని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఆయన మాట్లాడుతూ... తాము అధికారంలోకి వస్తే చాలా చేస్తామంటూ కాంగ్రెస్ హామీలు ఇస్తోందని, కానీ కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఆసుపత్రులు బాగా లేవని సరిహద్దు గ్రామాల వారు తెలంగాణకు వచ్చి చికిత్స చేయించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ బాస్ ఢిల్లీలో ఉంటారని, వారు కనీసం మంచినీళ్లు తాగాలన్నా ఢిల్లీకి పరుగెడతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జూటా మాటలు, అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు.

అవకాశం వచ్చిన ప్రతిసారి తెలంగాణపై మోదీ విషం చిమ్ముతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకోలేదని మోదీ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడగానే మోదీ అన్యాయం చేశారన్నారు. రాత్రికి రాత్రి ఏడు మండలాలను ఏపీలో కలిపేశారన్నారు.

పరిపాలన వికేంద్రీకరణ జరగాలని, పాలన ప్రజలకు చేరువ కావాలని కేసీఆర్‌ ఆకాంక్ష అని, అందులో భాగంగానే కొత్త జిల్లాలు, గ్రామాలు, మండలాలను ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత కరెంట్ అన్నారని, కానీ అది ఉత్త కరెంట్ అయిందని, నాడు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్సుఫార్మర్లు దర్శనమిచ్చేవన్నారు.
Advertisement
Harish Rao

More Telugu News