ఇస్రోలో వరుస రాజీనామాలు.. రంగంలోకి దిగిన కేంద్రం!

ISRO Series of Resignations Center Intervenes to Control Situation
  • కీలక మిషన్ల శాస్త్రవేత్తల రాజీనామాలపై కేంద్రం కఠిన నిర్ణయం
  • శాస్త్రవేత్తల రాజీనామాలు ఇక సాధారణంగా ఆమోదించ వద్దని ఆదేశం
  • తుది నిర్ణయం అంతరిక్ష శాఖే తీసుకోనుందంటూ అంతర్గత మెమో
  • ఇస్రోలో 100-120 మంది వరకు రాజీనామా చేసినట్లు సమాచారం
  • కీలక ప్రాజెక్టులపై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టిన కేంద్రం
  • పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటామన్న ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌
ఇస్రోలో కీలక ప్రాజెక్టులపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర అంతరిక్ష శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గగన్‌యాన్‌తో పాటు ఇతర ప్రధాన మిషన్లలో ఉన్న శాస్త్రవేత్తల స్వచ్ఛంద పదవీ విరమణ, రాజీనామాలపై కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.

జులై 14న విడుదల చేసిన అంతర్గత మెమో ప్రకారం.. గగన్‌యాన్‌, ఇతర కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న గ్రూప్‌-ఏ శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తులను ఇకపై సాధారణంగా ఆమోదించరాదని స్పష్టం చేసింది. ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు అలాంటి అభ్యర్థనలను కేంద్రాల డైరెక్టర్లు ఆమోదించకుండా, తమ సిఫార్సులతో పాటు అంతరిక్ష శాఖకు పంపాలని ఆదేశించింది. తుది నిర్ణయం మంత్రిత్వ శాఖే తీసుకోనుంది.

ఇస్రోలో ఇటీవల రాజీనామాలు పెరిగిన విషయాన్ని పరోక్షంగా అంతరిక్ష శాఖ గుర్తించింది. అయితే ఎంతమంది వెళ్లారనే అధికారిక వివరాలు వెల్లడించలేదు. ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’తో మాట్లాడిన ఇస్రో వర్గాల ప్రకారం కనీసం 100 నుంచి 120 మంది వరకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వారిలో యూఆర్‌ఎస్‌సీ నుంచి సుమారు 80 మంది, వీఎస్‌ఎస్‌సీ నుంచి కనీసం 20 మంది ఉన్నట్లు సమాచారం. ఎల్‌వీఎం-3 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ విక్టర్‌ జోసెఫ్‌, స్పాడెక్స్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌తో పాటు చంద్రయాన్‌-3లో కీలకంగా పనిచేసిన ఓ యువ శాస్త్రవేత్త కూడా రాజీనామా చేసినట్లు వర్గాలు తెలిపాయి.

ఈ పరిణామాలపై ఇస్రో ఛైర్మన్‌ వి.నారాయణన్‌ స్పందించారు. రాజీనామాలు జరుగుతున్న మాట వాస్తవమేనని, అయితే ప్రతి సంస్థలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయన్నారు. కీలక ప్రాజెక్టులకు ఒక్కసారిగా అంతరాయం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎవరైనా వెళ్లినా వారి బాధ్యతలను మరొకరు చేపడతారని, పరిస్థితిని ఇస్రో సమర్థంగా నిర్వహిస్తోందని వెల్లడించారు.

ఇస్రోలో మొత్తం 14,600 మందికి పైగా ఉద్యోగులు ఉన్నప్పటికీ, రాజీనామాలు చేసినవారిలో కీలక మిషన్లకు చెందిన అనుభవజ్ఞులు ఉండటమే ఆందోళన కలిగిస్తోంది. చంద్రయాన్‌-3లో ల్యాండింగ్‌ ప్రక్రియ ధ్రువీకరణకు అవసరమైన లక్షకు పైగా పరీక్షలు నిర్వహించి, దాదాపు 25 టెరాబైట్ల డేటాను సిద్ధం చేసిన ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఆదిత్య రాళ్లపల్లి కూడా సంస్థను వీడినట్లు సమాచారం.

2020లో జారీ చేసిన నిబంధనల ప్రకారం గ్రూప్‌-ఏ శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలను సంబంధిత కేంద్రాల డైరెక్టర్లే ఆమోదించే అధికారం ఉండేది. తాజా ఆదేశాలతో గగన్‌యాన్‌, ఇతర ప్రధాన మిషన్లలో పనిచేసే శాస్త్రవేత్తల విషయంలో ఆ అధికారాన్ని వెనక్కి తీసుకుంది. ఖాళీలను భర్తీ చేయడం కంటే అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలను భర్తీ చేయడం అంత సులభం కాదనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.
Advertisement
ISRO
Department of Space
Gaganyaan Mission
ISRO Scientist Resignation
Chandrayaan 3
V Narayanan

More Telugu News