భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం.. రేపు పట్టాలెక్కనున్న దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు!
- రేపు హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- జింద్ నుంచి సోనిపట్ మధ్య పరుగులు పెట్టనున్న రైలు
- గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న రైలు
భారతీయ రైల్వే రంగంలో సరికొత్త పర్యావరణ హిత విప్లవానికి కౌంట్డౌన్ షురూ అయింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ వేదికగా ప్రధాని మోదీ రేపు (జూలై 17) ఈ ప్రతిష్ఠాత్మక రైలుకు పచ్చజెండా ఊపి, జాతికి అంకితం చేయనున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీతో జర్మనీ, జపాన్, చైనా వంటి అగ్రదేశాల సరసన భారత్ చేరబోతోంది.
ఈ తొలి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య ఉన్న 89 కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టనుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య రోజుకు రెండు రౌండ్ ట్రిప్పులు తిరుగుతూ ప్రయాణికులను చేరవేస్తుంది. రూట్ నెంబర్ 74010 గల ఈ రైలు జింద్ నుంచి ఉదయం 7:40 గంటలకు బయలుదేరి, ఉదయం 9:40 గంటలకు సోనిపట్ చేరుకుంటుంది. మార్గమధ్యంలో జింద్ సిటీ, పాండు పిండర, లలిత్ ఖేరా, భంబేవా, గోహనాతో సహా మొత్తం 12 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
పూర్తిగా 10 కోచ్ల (2 డ్రైవింగ్ పవర్ కార్స్, 8 ప్యాసింజర్ కోచ్లు) కాన్ఫిగరేషన్తో చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో దీనిని డిజైన్ చేశారు. గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల ఆపరేషనల్ వేగంతో ప్రయాణించే ఈ రైలులో ఒకేసారి 2,600 మంది ప్రయాణించవచ్చు.
అసలు హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది?
ఈ రైలు నడవడానికి సంప్రదాయ డీజిల్ కానీ, ఓవర్హెడ్ విద్యుత్ తీగలు కానీ అవసరం లేదు. రైలులో అమర్చిన ఫ్యూయల్ సెల్స్ (ఇంధన కణాలు) సహాయంతో ఆన్బోర్డ్లోనే విద్యుత్ తయారవుతుంది. నిల్వ ఉంచిన హైడ్రోజన్ గ్యాస్, బయటి గాలిలోని ఆక్సిజన్తో కెమికల్ రియాక్షన్ జరిపి కరెంట్ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ప్రక్రియలో ఎలాంటి కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే బై-ప్రోడక్ట్స్గా బయటకు వస్తాయి. అందువల్ల ఇది 100% పర్యావరణానికి మేలు చేస్తుంది. ఈ రైలు ఇంధన అవసరాల కోసం జింద్లో ప్రత్యేకంగా 3,000 కేజీల కెపాసిటీ గల హైడ్రోజన్ జనరేషన్, రీఫ్యూయలింగ్ స్టేషన్ను కూడా రైల్వే శాఖ విజయవంతంగా ఏర్పాటు చేసింది.