BJP: త్వరలోనే బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా?
కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా లోక్సభ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏడాది ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే తొలి జాబితాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మినీ జమిలి ఎన్నికలు జరగొచ్చని, లోక్సభకు డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు జరుగుతాయన్న చర్చ నేపథ్యంలో ఈ ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది.
తొలుత దేశవ్యాప్తంగా 160 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తొలి జాబితాలోనే తెలంగాణలోని 12 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయని, ఈ మేరకు పేర్లు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులను ముందుగా ప్రకటించనున్నట్లు సమాచారం.
మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాకముందే.. తమ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. ఇలానే లోక్సభ ఎన్నికలకూ ముందస్తు అభ్యర్థుల ప్రకటన వ్యూహాన్ని అమలు చేయాలని కమలం పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.