Advertisement

పాస్టర్ ప్రవీణ్ ఘటనలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి నాలుగైదు రోజులు పట్టింది: సీఎం చంద్రబాబు

It took four to five days to counter propaganda in Pastor Praveen incident says CM Chandrababu
  • విజయవాడలో ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు
  • టెక్నాలజీతో పోలీసింగ్ తీరును మార్చాలని అధికారులకు సూచన
  • గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం
  • ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు నేరాలకు పాల్పడుతున్నారన్న సీఎం
  • నేరస్థులకు శిక్షలు పడేలా చేస్తేనే నేరాలు అదుపులోకి వస్తాయని స్పష్టీకరణ
ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయడం కోసం, అప్రతిష్ఠ పాలుచేయాలనే లక్ష్యంతో కొన్ని రాజకీయ పార్టీలు ఏకంగా నేరాలు చేయడానికి కూడా వెనుకాడటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి కుట్రపూరిత చర్యల వల్ల సమాజంలో అశాంతి నెలకొంటుందని, పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పాస్టర్ ప్రవీణ్ ఘటనలో జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి నాలుగైదు రోజులు పట్టిందని, సోషల్ మీడియా వేదికగా సాగే ఇలాంటి తప్పుడు ప్రచారాల పట్ల పోలీసులు వేగంగా స్పందించాలని ఆయన ఆదేశించారు.

విజయవాడలో మూడు రోజులుగా జరిగిన 'ఏపీ పోలీస్ రిట్రీట్ 2026 - ఫ్యూచర్ పోలీసింగ్' సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ పోలీసింగ్‌కు ఎదురయ్యే సవాళ్లను, వాటిని అధిగమించే వ్యూహాలను వివరించారు. తిరుమల మెట్ల దారిలో అపహరణకు గురైన ఆంజనేయ స్వామి విగ్రహం కేసును ప్రస్తావిస్తూ.. టెక్నాలజీ సాయంతో నిందితుడిని తక్కువ సమయంలోనే పట్టుకున్నారని, అయితే నిందితుడు మానసిక వికలాంగుడైనా, ఇలాంటి ఘటనల్లో వేగంగా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు.

సమాజంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం పెను సవాల్‌గా మారిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి వల్ల కుటుంబాలకు కుటుంబాలే నాశనమవుతున్నాయని, గంజాయి మత్తులో జరిగే నేరాలను కట్టడి చేయాలని స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్‌ను చాలా వరకు నియంత్రించామని, ఇంకా పూర్తి స్థాయిలో అరికట్టాల్సి ఉందని తెలిపారు. వీటి వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థను పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించాల్సిన (రీ-స్ట్రక్చర్) అవసరం ఉందని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. టెక్నాలజీ వినియోగం ద్వారా 'ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్' విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 'ఆపరేషన్ సిందూర్'ను తక్కువ మందితోనే టెక్నాలజీ సాయంతో విజయవంతం చేసినట్టు గుర్తుచేశారు. 

పోలీసులందరికీ డిజిటల్ అక్షరాస్యత తప్పనిసరి అని, పోలీసింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను (ఏఐ) విరివిగా వాడాలని సూచించారు. సోషల్ మీడియా, సైబర్ నేరాలు, మహిళలపై నేరాల కట్టడి వంటి అంశాల్లో పోలీసులకు ప్రత్యేక శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులు ప్రవేశపెట్టాలని ఆదేశించారు. రౌడీయిజం, ఫ్యాక్షనిజంను అదుపుచేశామని, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ స్థాయి సిబ్బంది అనుభవాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.
Advertisement
Chandrababu Naidu
AP Police Retreat 2026
Pastor Praveen incident
Andhra Pradesh Future Policing
Ganja and drug control
Social media misinformation

More Telugu News