Advertisement

కాంగ్రెస్ చేవెళ్ల డిక్లరేషన్‌పై మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు

Minister Harish rao on Chevella declaration
  • దళితులపై కాంగ్రెస్ కపట ప్రేమ కనబరుస్తోందని విమర్శ
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల విద్యుత్తే వస్తుందని వ్యాఖ్య
  • మూడోసారి బీఆర్ఎస్ గెలుస్తుందని హరీశ్ ధీమా
  • మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రజలకు ఏం చేయాలో తెలిసిన నేత కేసీఆర్ అన్న హరీశ్
కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ డిక్లరేషన్‌కు అసలు విలువే లేదన్నారు. దళితులపై కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ కనబరుస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల విద్యుత్ మాత్రమే వస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ అని చెబుతున్నారన్నారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని చెప్పారు.

 కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలష్ రెడ్డి, ఇతర నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... అసాధ్యమన్న తెలంగాణను కేసీఆర్ సాధించి చూపించారన్నారు. రైతు బంధు, రైతు బీమా సహా అనేక పథకాలు అమలు చేశారన్నారు. నాగర్ కర్నూలుకు మెడికల్ కాలేజీ వస్తుందని కలలో కూడా అనుకోలేదని, ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాకే ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు కాంగ్రెస్ కొబ్బరికాయలు కొడితే తెలుగుదేశం వాళ్లు మొక్కలు నాటారని, కానీ నీళ్లు మాత్రం రాలేదన్నారు.

ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్‌దే అన్నారు. కల్వకుర్తికి వంద పడకల ఆసుపత్రి బీఆర్ఎస్ వల్లే వచ్చిందన్నారు. కాంగ్రెస్ వాళ్ల డిక్లరేషన్ ఉత్తిత్తిదే అన్నారు. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదన్నారు. ఇక్కడ ఎలాగూ అధికారంలోకి రామని తెలిసి ఇష్టారీతిన హామీలు ఇస్తున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ ప్రజలకు ఏం చేయాలో తెలిసిన నాయకుడు కేసీఆర్ అన్నారు.
Advertisement
Harish Rao
BRS
Congress

More Telugu News