Advertisement

ఫుల్లుగా మందుకొట్టి నీట్ పీజీ పరీక్షకు వచ్చాడు!

Student attends NEET PG exam in drunken state
  • తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ పరీక్ష
  • రంగారెడ్డి జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో వింత ఘటన
  • మద్యం సేవించి పరీక్ష హాల్‌కు వచ్చిన మహ్మద్ రిజ్వాన్ అనే విద్యార్థి
  • గుర్తించి బయటకు పంపిన సిబ్బంది, కేసు నమోదు చేసిన పోలీసులు
  • విద్యార్థికి బ్రీత్ అనలైజర్ టెస్ట్.. కొనసాగుతున్న విచారణ
తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు అభ్యర్థులు సకాలంలోనే కేంద్రాలకు చేరుకున్నారు. అయితే, రంగారెడ్డి జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థి మద్యం సేవించి హల్‌చల్ చేయడం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని పరీక్షా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ అనే విద్యార్థి సెక్యూరిటీ తనిఖీలను తప్పించుకుని నేరుగా పరీక్ష హాల్‌లోకి ప్రవేశించాడు. లోపల అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటం, అతని నుంచి మద్యం వాసన రావడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

పరీక్ష రాసేందుకు అనర్హుడని నిర్ధారించుకున్న సిబ్బంది అతడిని హాల్ నుంచి బయటకు పంపించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రిజ్వాన్‌కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా, అతను మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మిగతా కేంద్రాల్లో పరీక్షలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి.
Advertisement
Mohammed Rizwan
NEET PG Exam
Telangana News
Rangareddy Drunk Student
Ibrahimpatnam News
Medical Entrance Exam Incident

More Telugu News