Advertisement

అది ఆర్ఎస్ఎస్ ఉపయోగించే పాత ట్రిక్: అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi calls Mohan Bhagwat statement an old RSS trick
  • మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ ఆడే పాత నాటకమని విమర్శించిన ఒవైసీ
  • ఆర్ఎస్ఎస్‌కు రెండు నాల్కల ధోరణి ఉంటుందని ఆరోపణ
  • ముస్లింలు, క్రైస్తవులను అంతర్గత శత్రువులుగా చూశారన్న అసద్
  • గోల్వాల్కర్, హెడ్గేవార్ రచనల గురించి ప్రస్తావించిన ఎంపీ
  • యూసీసీ, మతమార్పిడి నిరోధక చట్టాల వెనుక ఆర్ఎస్ఎస్ భావజాలమేనని వ్యాఖ్య
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "భారత్‌లో ముస్లింలు ఉండకూడదని భావించేవాడు హిందువే కాడు" అని భగవత్ పేర్కొనడంపై ఒవైసీ స్పందిస్తూ.. ఇది ఆర్‌ఎస్‌ఎస్ ఉపయోగించే పాత ట్రిక్ అని, వారి ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ మేరకు తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌కు రెండు రకాల మాటలు ఉంటాయని, ప్రపంచానికి ఒకటి, తమ సొంత సభ్యులకు మరొకటి చెబుతారని ఒవైసీ ఆరోపించారు. ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల వారి ప్రధాన సిద్ధాంతకర్తలు, రచయితలు ఏం చెప్పారో ఆర్‌ఎస్‌ఎస్ ఎన్నడూ ఖండించలేదని గుర్తుచేశారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్, నాడు గాంధీజీ ప్రతిపాదించిన హిందూ-ముస్లిం ఐక్యతను వ్యతిరేకించడం వల్లే కాంగ్రెస్‌ను వీడారని ఒవైసీ పేర్కొన్నారు. అలాగే, మరో సిద్ధాంతకర్త గోల్వాల్కర్.. ముస్లింలు, క్రైస్తవులను దేశానికి 'అంతర్గత ముప్పు'గా అభివర్ణించారని ఆయన తన పోస్టులో ప్రస్తావించారు.

గుజరాత్‌లో ముస్లింలపై జరిగిన దాడులను కూడా ఒవైసీ గుర్తుచేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ముసుగు పాలనలోనే ఆ దారుణాలు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ), క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్న మతమార్పిడి నిరోధక చట్టాలు, యూఏపీఏ వంటి కఠిన చట్టాల దుర్వినియోగం వెనుక ఆర్‌ఎస్ఎస్ భావజాలమే ఉందని ఆయన విమర్శించారు.

ఈ నేపథ్యంలో, సావర్కర్, హెడ్గేవార్, గోల్వాల్కర్ వంటి వారి విషపూరిత రచనలలోని కొన్ని భాగాలను భగవత్ బహిరంగంగా చదివి వినిపించాలని, ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ నిజస్వరూపంపై ప్రజలే ఓ నిర్ణయానికి వస్తారని ఒవైసీ సవాల్ విసిరారు.
Advertisement
Asaduddin Owaisi
RSS
Mohan Bhagwat
AIMIM
Hyderabad MP
Hindutva Ideology

More Telugu News