ప్రతిరోజూ రాత్రి కరెంటు పోతుంటే ఏంటా అనుకున్నారు... తీరా చూస్తే...!

Bihar girl caused power outages
  • బీహార్ లో ఘటన
  • కొంతకాలంగా ప్రేమలో ఉన్న ప్రీతి, రాజ్ కుమార్
  • ఇద్దరూ వేర్వేరు గ్రామాలకు చెందినవారు
  • ప్రియుడ్ని చీకట్లో కలుసుకునేందుకు రాత్రివేళల్లో కరెంటు తీసేస్తున్న ప్రీతి
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు
బీహార్ లోని బెట్టియా గ్రామంలో గత కొంతకాలంగా ప్రతిరోజూ రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. అయితే, గ్రామస్తుల పరిశీలనలో ఆశ్చర్యపోయే అంశం వెల్లడైంది. ఈ పవర్ కట్స్ కు కారణం ఓ అమ్మాయి అని తేలింది. 

బెట్టియా గ్రామానికి చెందిన ప్రీతి కుమారి, పొరుగూరికి చెందిన రాజ్ కుమార్ ప్రేమించుకున్నారు. పగలు తన ప్రియుడ్ని కలుసుకోవడం అందరూ చూస్తారని భావించిన ప్రీతి... రాత్రివేళల్లో అతడిని కలుసుకునేది. రాత్రివేళల్లో కూడా లైట్లు ఉంటాయి కాబట్టి, ఇబ్బంది అని భావించిన ఆ అమ్మాయి ఊరి మొత్తానికి కరెంటు సరఫరా నిలిపివేసేది. ఆ చీకట్లో ప్రియుడ్ని కలుసుకునేది. 

ప్రియుడు రాజ్ కుమార్ ను కలుసుకునేందుకు ప్రీతి బయల్దేరిందంటే ఆ ఊరు అంధకారంలో మునిగిపోవాల్సిందే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. గ్రామస్తులు ఈ అనూహ్య కరెంటు కోతలపై విద్యుత్ శాఖకు ఫిర్యాదు చేసినా వారు తమ తప్పేమీ లేదని స్పష్టం చేశారు. దాంతో గ్రామస్తులు నిఘా వేశారు. 

ఎప్పట్లాగానే రాత్రివేళ కరెంటు పోగానే గ్రామస్తులు అసలు విషయం ఏంటని శోధించారు. ఈ క్రమంలో ప్రీతి-రాజ్ కుమార్ జోడీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. కరెంటు కోతలకు వీరి ప్రేమ వ్యవహారమే కారణమని గుర్తించారు. 

బెట్టియా గ్రామస్తులు రాజ్ కుమార్ ను పట్టుకుని దేహశుద్ధి చేయగా, అతడు తన ఊరివాళ్లను తీసుకువచ్చి బెట్టియా గ్రామస్తులపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Go Back to Shorts
Preeti Kumari
Rajkumar
Power Cuts
Bettiah
Champaran Districts
Bihar

More Telugu News