Praveen Kumar: బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Former IPS Praveen Kumar joins BSP
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరారు. నల్గొండ ఎన్జీ కాలేజీలో రాజ్యాధికార సంకల్ప సభ జరిగింది. ఈ సభకు బీఎస్పీ జాతీయ సమన్వయకర్త రాంజీ గౌతమ్ విచ్చేశారు. ఆయన సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, నిరుపేద ప్రజల కోసమే ఉద్యోగం వదులుకున్నట్టు వెల్లడించారు. బహుజన సమాజంలో బానిసలు ఎవరూ ఉండరని స్పష్టం చేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ దళితులకు ఇస్తామంటున్న రూ.1000 కోట్లు ఎవరి డబ్బు అని నిలదీశారు. ఒకవేళ ఆయనకు దళితులపై అంత ప్రేమే ఉంటే సొంత ఆస్తులు అమ్మి ఇవ్వాలని స్పష్టం చేశారు. బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలన్నదే తమ ఆకాంక్ష అని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. బీఎస్పీ ద్వారా న్యాయం జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు.

కాగా, తన ప్రసంగంలో ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అంశాన్ని కూడా ప్రవీణ్ కుమార్ ప్రస్తావించారు. పార్లమెంటు సాక్షిగా రఘురామ తనపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. నిరుపేదలు ఎప్పటికీ అలాగే ఉండాలని రఘురామ భావిస్తున్నారా? అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Praveen Kumar
BSP
Former IPS
Telangana

More Telugu News